ధనుష్ కేసులో తీర్పు రిజర్వ్: నేనేమీ దాయటంలేదు, డీఎన్ఏ టెస్ట్కు నో
నటుడు ధనుష్ తమ కుమారుడేనన్న పిటిషన్పై కోర్టులో మంగళవారం వాదనలు ముగిసాయి. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పును రిజర్వ్లో ఉంచింది.
చెన్నై: నటుడు ధనుష్ తమ కుమారుడేనన్న పిటిషన్పై కోర్టులో మంగళవారం వాదనలు ముగిసాయి. ధనుష్ తమ కుమారుడేనంటూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో కదిరేశన్, మీనాక్షి దంపతులు పిటిషన్ దాఖలు చేశారు.
కేసు తోసి పుచ్చాలని ధనుష్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పును రిజర్వ్లో ఉంచింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ తమ కుమారుడేనని, వృద్ధాప్యంలో ఉన్న తమకు మెయింటినెన్స్ కింద నెలకు రూ.65వేలు ఇప్పించాలని కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టుకు ఎక్కారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ధనుష్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ టెక్నాలజీ ద్వారా ఆయన తన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను చెరిపేసుకున్నాడని తేల్చారు.
కదిరేశన్ దంపతులు కోర్టుకు సమర్పించిన పత్రాలు, ధనుష్ తరఫున దాఖలు చేసిన పత్రాలను కోర్టు క్షుణ్నంగా పరిశీలించింది. ధనుష్ నవంబర్ 7, 1985లో జన్మించాడని, అసలు పేరు కరైసెల్వన్ అని వృద్ధ దంపతులు కోర్టుకు తెలిపారు.
ఇంటర్ చదువుతున్న సమయంలో ఇంటి నుంచి పారిపోయి చెన్నై వెళ్లిపోయాడని, 2002లో పేరు మార్చుకున్నాడని, ధనుష్ చిన్ననాటి ఫోటులు కూడా విడుదల చేశారు.
అయితే ధనుష్ మాత్రం కదిరేశన్ దంపతులు చెప్పిన దాంట్లో నిజం లేదని చెబుతున్నారు. తన నుంచి డబ్బు గుంజేందుకే కేసులు వేస్తున్నారని ఆరోపించారు. తనను పెంచిన కస్తూరి రాజే తన తండ్రి అని కోర్టుకు స్పష్టం చేశారు. అలాగే, తాను డీఎన్ఏ టెస్టుకు అంగీకరించనని ధనుష్ తెలిపారు. తాను ఏమీ దాయడం లేదని చెప్పారు.