లోక్ సభ యుద్ధ భేరి: ఈవీఎంలల్లో అభ్యర్థుల ఫొటోలు కనిపిస్తాయ్
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. పోలింగ్ సందర్భంగా వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో కొత్తగా అభ్యర్థుల ఫొటోలు కూడా కనిపించే ఏర్పాటు చేసింది. ఈ తరహా ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. ఇదివరకు ఈవీఎంలల్లో అభ్యర్థుల గుర్తు మాత్రమే ఏర్పాటు చేసేవారు. ఈసారి దీనికి భిన్నంగా అభ్యర్థుల ఫొటోలను కూడా ముద్రిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు.
ఓటరు స్లిప్పులు ఒక్కటే చాలవు:
ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారు తమ వెంట ఓటరు స్లిప్పులతో పాటు ఇతర ఫొటో గుర్తింపు కార్డులను కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందని సునీల్ అరోరా తెలిపారు. పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకులు లేదా పోస్టాఫీసులు జారీ చేసిన పాస్ బుక్కులు, పాన్ కార్డు, ఉపాధి హామీ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డులు, జాబ్ కార్డులు, కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆరోగ్య బీమాకు సంబంధించిన స్మార్ట్ కార్డులు, ఫొటో అతికించిన పింఛన్ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డుల్లో ఏదైనా ఒకదానిని వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని సునీల్ అరోరా తెలిపారు.
10 లక్షల పోలింగ్ కేంద్రాలు..
దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలను నెలకొల్పబోతున్నట్లు సునీల్ అరోరా వెల్లడించారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచామని అన్నారు. గతంలో తొమ్మిది లక్షల పోలింగ్ కేంద్రాలను అందుబాటులో తెచ్చామని, ఈ సారి వాటి సంఖ్యను సుమారు 10 లక్షలకు పెంచుతామని చెప్పారు.