ఉపరాష్ట్రపతి రేసులో కెప్టెన్ అమరీందర్ సింగ్-తన పార్టీ బీజేపీలో విలీనానికి రెడీ
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే, విపక్షాల ఉమ్మడి అభ్యర్ధులు ఇప్పటికే ఖరారయ్యారు. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీలు తమ కసరత్తు ప్రారంభించాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం.. పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో ప్రముఖంగా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరును తెరపైకి తెస్తోంది.
ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వెంకయ్యనాయుడిని కొనసాగించే ఉద్దేశం ఎన్డీయేకు లేదని గతంలోనే తేలిపోయింది ఈ నేపథ్యంలో రేసు మొదలుపెట్టిన ఎన్డీయేకు ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో తమకు సాయం చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ గుర్తుకొచ్చారు. దీంతో ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించడం ద్వారా సిక్కుల్లో, రైతుల్లో ఎన్డీయేపై ఉన్న ఆగ్రహాన్ని కాస్తయినా తగ్గించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది. తన పేరును ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రతిపాదించే అవకాశం ఉందని కెప్టెన్ అమరీందర్ సింగ్ కార్యాలయం నిర్ధారించింది.
పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టి ఘోర పరాజయం పాలైన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ వెన్నెముక చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. అదే సమయంలో అమరీందర్ి సింగ్ తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి ప్రతిగానే ఆయన్ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసి గౌరవించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అమరీందర్ సింగ్ తనను అవమానకర రీతిలో పంజాబ్ సీఎం పదవి నుంచి తప్పించారన్న కారణంతో పార్టీని వీడారు. దీన్ని సొమ్ముచేసుకునేందుకు ఆయనతో పొత్తు పెట్టుకున్న బీజేపీని కూడా ప్రజలు ఆదరించలేదు.