కొత్త ఏడాది తీపి కబురు!: ఏటీఎంలో రూ.4,500 తీసుకోవచ్చు
పెద్ద నోట్ల రద్దు అనంతరం నుంచి నగదు కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కలిగించే వార్త ఇది. ఒక రోజులో ఏటీఎం నుంచి రూ.4,500 డ్రా చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నుంచి నగదు కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కలిగించే వార్త ఇది. ఏటీఎంల నుంచి నగదు తీసుకునే పరిమితిని భారతీయ రిజర్వ్బ్యాంక్ పెంచింది. ఇప్పటి వరకు రోజుకు రూ. 2500 మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది.
ఈ మొత్తాన్ని రూ.4500కు పెంచుతూ ఆర్బీఐ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అయితే వినియోగదారులు వారానికి గరిష్టంగా తీసుకునే మొత్తం(రూ.24,000)లో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు.
నోట్ల కొరత ఉంది: బ్యాంకర్లు
పెద్ద నోట్లు రద్దు ప్రకటన వెలువడి 50 రోజులు గడుస్తున్నా కొత్త రూ.500, రూ.2000 నోట్లు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకులకు చేరలేదు. నోట్ల రద్దుపై నిర్వహించిన ఉన్నతస్ఠాయి సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. డిసెంబరు 26 వరకు ఉన్న పరిస్థితులపై బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి గణాంకాలతోసహా నివేదిక అందజేశాయి.
రిజర్వు బ్యాంకు నుంచి తమకు సరిపడా కొత్త నోట్లు రావడం లేదని అనేక బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. బీహార్లో మాత్రమే సరిపడా నోట్లు అందుబాటులో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానప్పటికీ.. దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా ఏటీఎంల్లో నగదు ఉందని, అవన్నీ పని చేస్తున్నాయని బ్యాంకర్లు పేర్కొన్నారు.