రాజ్యసభ సీటు కావాలా లేక గవర్నర్గా వెళ్తారా?: డిసైడ్ చేసేది మేమే: జస్ట్ రూ.100 కోట్లే
న్యూఢిల్లీ: నేరగాళ్ల పంథా మారింది. చిల్లర మల్లర దొంగతనాలకు బదులుగా ఏకంగా కుంభస్థలంపైనే కన్నేశారు. ఒక్క దెబ్బకు కోట్ల రూపాయలను కూడబెట్టుకునేలా ప్లాన్లు వేశారు. రాజ్యంగ ప్రతినిధిగా భావించే గవర్నర్ పదవినీ అమ్మకానికి పెట్టారు. పెద్దల సభకు గౌరవం పొందిన రాజ్యసభ స్థానాలనూ బేరానికి పెట్టారు. దీనికి వారు పెట్టిన ఖరీదు 100 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని చెల్లించి ఎవ్వరైనా సరే రాజ్యసభ సభ్యుడిగా వెళ్లడమా? లేక గవర్నర్ హోదాను పొందడమా? అనేది డిసైడ్ చేసుకోవచ్చు.
ఇలాంటి ముఠా గుట్టును కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. నిజానికి రాజ్యసభకు ఎవరిని పంపించాలనేది ఆయా రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. గవర్నర్ స్థానంలో ఎవరిని అపాయింట్ చేయాలనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అలాంటి వాటిని కూడా అమ్మకానికి పెట్టారు ఈ ముఠా సభ్యులు. దీనితోపాటు ప్రభుత్వ సంస్థల ఛైర్మన్లుగా నామినేటెడ్ పోస్టులను కూడా తామే నిర్ణయిస్తామంటూ నమ్మించారు.
ఇలా మాయమాటలు చెప్పి, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులను మోసం చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ రాకెట్తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశామని, దీనికి అనుబంధంగా పలుచోట్ల దాడులు చేశామని వివరించారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశామని, మరో కీలక సభ్యుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతని కోసం గాలిస్తోన్నామని, ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కమలాకర్ ప్రేమ్ కుమార్ బంద్గర్, కర్ణాటక బెళగావికి చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీ-నేషనల్ క్యాపిటలర్ రీజియన్ పరిధిలో నివసించే మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరా, మహ్మద్ ఇజాజ్ ఖాన్ను అరెస్ట్ చేశారు. కమలాకర్ ప్రేమకుమార్ సీనియర్ సీబీఐ అధికారిగా నటిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులతో సంబంధాలను కొనసాగించాడని వివరించారు.