అసాధ్యం: జమిలి ఎన్నికలపై తేల్చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు జరపాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తేల్చి చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. దీనికి న్యాయపరమైన అంశాలు పూర్తి చేయడానికి సమయం పడుతుందని అన్నారు. వీటికి తోడు వీవీప్యాట్ యంత్రాలు 100శాతం అందుబాటులో ఉండాలని, సమీప భవిష్యత్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని రావత్ స్పష్టం చేశారు.

ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలంటే అందుకు సరిపడా పోలీస్, పోలింగ్ సిబ్బంది అవసరం ఉంటుందని చెప్పారు. లోక్సభ, రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్కు లేఖ రాసిన మరుసటి రోజే రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయితే, దీనిపై న్యాయశాఖ కమిషన్ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, 2019 ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేస్తోంది.












Click it and Unblock the Notifications