ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన - ఇక పట్టణాల్లోనూ ఉపాధి హామీ చట్టం - అమలు దిశగా కేంద్రం
కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయిందని. గడిచిన ఐదు నెలల కాలంలో జీతాలు పొందే వర్గాల్లోనే సుమారు కోటిన్నర ఉద్యోగాలు హరీమన్నాయి. ఈ క్లిష్టపరిస్థితుల్లో పేదలకు అంతో ఇంతో అండగా నిలిచింది ఏదైనా ఉందంటే.. అది జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) ఒక్కటే. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన పథకంగా పేరుపొందిన నరేగా ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అమలవుతోంది. ఈ చట్టాన్ని త్వరలోనే పట్టణాలకు కూడా విస్తరింపజేయాలని, తద్వారా లాక్ డౌన్ వల్ల చితికిపోయిన పట్టణ పేదలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
లాక్ డౌన్ సమయంలో పేదలను, ఇతర వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పరిశ్రమలు, వ్యవసాయం తదితరాలకే ప్రాధాన్యం దక్కడం... పట్టణాల మీద, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన మీద పెద్దగా ఫోకస్ చేయకపోవడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఆ లోటును పూడ్చుతూ, త్వరలోనే పట్టణాల్లోనూ ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తెచ్చి, 100 రోజుల జాబ్ గ్యారంటీ కల్పించాలని కేంద్రం భావిస్తున్నది.
''ఉపాధి హామీ చట్టం ద్వారా కోరిన ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఏడాదికి కనీసం 100 రోజుల పని కల్పించే ప్రక్రియను పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలనే ఆలోచనను కేంద్రం గత ఏడాది నుంచే లోతుగా పరిశీలిస్తున్నది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దాన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడిన తర్వాత.. ముందుగా చిన్న పట్టణాల్లో ఉపాధి పనులు ప్రారంభిస్తాం. ఇందు కోసం అదనంగా 4.8 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా'' అని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.
మావోయిస్టు పార్టీలో మరో సంచలనం - గణపతి బాటలో మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు? - తెలంగాణ సేఫ్!
లాక్ డౌన్ లో ఊళ్లకు వెళ్లిన వలస కూలీలకు ఉపాధి హామీ పథకం వరంగా మారడం, మోదీ సర్కార్ ఆ మేరకు పథకానికి నిధులు కూడా పెంచడం, కొత్త జాబ్ కార్డుల జారీని కూడా వేగవంతం చేయడం తెలిసిందే. పట్టణీకరణ వేగంగా జరుగుతోన్న దశలో ఉపాధి ఫోకస్ మొత్తం గ్రామాలపైనే కాకుండా, పట్టణాలపైనా ఉండాల్సిందేనని ఆర్థిక నిపుణులు సలహాలిస్తున్నారు. అదేసమయంలో.. మహానగరాల్లో ఉపాధి హామీ చట్టం అమలు చేస్తే నిర్మాణ, ఇతర రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్న నేపథ్యంలో ముందుగా చిన్న పట్టణాల్లో దీన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు.