కేంద్ర క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం.. 25 మంది బీజేపీ ఎంపీలతో అమిత్ షా, మోడీ భేటీల మతలబు అదే !!
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేసే ఆలోచనలో ఉందని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్యాబినెట్ విస్తరణ కు సంబంధించి పలు ఊహాగానాల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారాంతంలో 25 మంది ఎంపీలు, మంత్రులను కలిశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించారు.

చక చకా సమావేశాలు నిర్వహిస్తున్న అమిత్ షా, మోడీలు
మోడీ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ జరుగుతుందనే వార్తల మధ్య గుజరాత్, ఉత్తర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల బిజెపి ఎంపీలు శనివారం-ఆదివారం అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారని సమాచారం. అమిత్ షా ఇతర రాష్ట్రాలతో పాటు యుపి, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ నుండి బిజెపి ఎంపిలను కలిశారు.
గత రెండేళ్లలో ప్రభుత్వ పనితీరు పై అభిప్రాయం తెలుసుకోవడంతో పాటుగా , కేంద్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మంత్రులతో క్యాబినెట్ విస్తరణపై చర్చ
ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, డివి సదానంద గౌడ, మంత్రి వి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. కేబినెట్ విస్తరణ గురించి సూచించే సమావేశాల క్రమంలో ఇది ఐదవ సమావేశం. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న సమావేశాలను బట్టి చూసే పెద్ద ఎత్తున మంత్రివర్గ మార్పులకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో ప్రస్తుతం 21 మంది క్యాబినెట్ మంత్రులు తొమ్మిది మంది ఇండిపెండెంట్ హోదాతో సహాయ మంత్రులు, 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు.

కేంద్ర క్యాబినెట్ విస్తరణకు కసరత్తుకు కారణం ఇదేనా !!
ఇక ప్రస్తుతం 25కు పైగా ఖాళీలు ఉన్నాయి.పలువురు మంత్రులు తమ శాఖలతో పాటు అదనపు శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా దృష్టిపెట్టినట్లు గా తెలుస్తుంది. ఇక ఈ మార్పులు యూపీ ,గుజరాత్, ఇతర రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే జరగనున్నట్లుగా కూడా చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications