పతంజలి కరోనా మెడిసిన్: వివరాలు ఇవ్వాలని, ప్రచారం ఆపాలంటూ కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ఆయుర్వేద ఔషధం తయారు చేసిన పతంజలి మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసింది. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. అయితే, పతంజలి ప్రకటనపై కేంద్రం స్పందించింది. ముందు ఆ ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
పతంజలి ఆయుర్వేద కనుగొన్న కరోనా ఔషధానికి సంబంధించిన వివరాలను
వీలైనంత త్వరగా తమకు అందించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆ సంస్థను
కోరింది. అందులో ఉపయోగించిన మూలకాల పరిణామాలు, ప్రయోగ ఫలితాలు,
ఆస్పత్రుల్లో జరిపిన క్లినికల్ ట్రయల్స్ వివరాలను కోరింది. పతంజలి సంస్థ ప్రకటించినట్లు ప్రయోగ ఫలితాల్లో నిజానిజాలు మంత్రిత్వ శాఖకు ఇంకా తెలియవని ఆయుష్ ప్రకటించింది.

తమ మందుతో ఏడు రోజుల్లో కరోనా నుంచి విముక్తి కలిగిందన్న ప్రకటనలు ప్రచారం చేయొద్దని ఆదేశించింది. ఫలితాలను పూర్తి స్థాయిలో పరిశీలించి, విశ్లేషించేంత వరకూ ఆగాలని సూచించింది. కరోనిల్, స్వాసరి పేరుతో పతంజలి ఆయుర్వేద మంగళవారం ఔషధాలను ఆవిష్కరించింది.
దేశ వ్యాప్తంగా 280 మంది కరోనా బాధితులపై ప్రయోగాలు చేశామని వివరించింది. క్లినికల్ ట్రయల్స్ లో 100 శాతం ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని స్పష్టం చేసింది. తమ ఔషధంతో మూడు రోజుల్లోనే 69 శాతం మందికి నెగెటివ్ వచ్చిందని, 7 రోజుల్లో అందరూ కోలుకున్నారని రాందేవ్ బాబా వెల్లడించారు.












Click it and Unblock the Notifications