చక్కెరపై కేంద్రం తాజా నిర్ణయం
దేశంలో రోజురోజుకూ చక్కెర ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు 29 శాతం పెరుగుదల నమోదైంది వీటి రేట్లల్లో. ఇది మధ్య తరగతి కుటుంబీలకు భారంగా మారింది. రూ. 40- రూ. 45 పలికే కిలో చక్కెర ఇప్పుడు 75 రూపాయల వరకు వెళ్లింది. పండగ సీజన్ నేపథ్యంలో ఇక ముందు కూడా వీటి రేట్లు పెరగబోవనే గ్యారంటీ ఉండట్లేదు. ఏ ఒక్క రాష్ట్రానికో ఇది పరిమితం కాలేదు. దేశం మొత్తం గగ్గోలు పెడుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి, కృత్రిమ కొరతను నిరోధించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెర (Raw Sugar) ను శుద్ధి చేసి, రెండు నెలల వ్యవధిలోనే దేశీయంగా విక్రయించడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన నిబంధనలను సవరిస్తూ తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువడించింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. దిగుమతిదారులు ముడి చక్కెరను నిల్వ ఉంచకూడదు. ఎప్పటికప్పుడు నిర్ణీత గడువులోగా దీన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. గతంలో దీనిపై స్పష్టమైన కాలపరిమితి లేకపోవడంతో వ్యాపారులు గోడౌన్ లల్లో పెద్ద మొత్తంలో స్టాక్ చేసి పెట్టుకునే అవకాశం ఉండేది. దీన్ని తొలగించింది కేంద్రం. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను ఇకపై ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి, మార్కెట్ లో విక్రయించాల్సి ఉంటుంది.
దేశీయంగా చక్కెర లభ్యతను మరింత పెంచడానికి వీలుగా వీలుగా అక్టోబర్ 31 నాటికి 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని నిర్దేశిత గడువులోగా ప్రాసెస్ చేయాలంటూ తాజా నోటిఫికేషన్ లో పొందుపరిచింది కేంద్రం. అలా చేయకపోతే.. నిబంధనలకు అనుగుణంగా ముడి చక్కెర దిగుమతిదారులపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది.
మిల్లుల వద్ద కూడా ధరలు అకస్మాత్తుగా పెరగడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా అన్నారు. దేశంలో చక్కెర కొరత లేదని, త్వరలోనే ధరలు తగ్గుముఖం పడతాయని అటు ఇండియన్ షుగర్ అండ్ బయోఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత సీజన్లో వివిధ కారణాల వల్ల చక్కెర ఉత్పత్తి అంచనాలు 306 లక్షల టన్నులకు తగ్గినప్పటికీ, దేశీయ అవసరాలకు ఇవి సరిపోతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications