Jharkhand Elections: జార్ఖండ్ లో గెలుపెవరిదో చెప్పేసిన హేమంత్ బాబాయ్..!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఇండియా కూటమికీ, విపక్ష ఎన్డీయే కూటమికీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇందులో ఎలాగైనా నెగ్గి తీరాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగా తాజా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ బాబాయ్ వరసైన చంపై సోరెన్ ను విజయవంతంగా జేఎంఎం నుంచి తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో కీలకమైన కొల్హాన్ ప్రాంతంలో విజయానికి చంపై కీలకంగా మారారు.
గత ఎన్నికల్లో బీజేపీకి కొల్హాన్ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకున్న చరిత్ర చంపై సొరెన్ కు ఉంది. అలాంటి చంపై సోరెన్ ను ఇప్పుడు బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. గిరిజన వర్గాల్లో గట్టి పట్టున్న నేత చంపై సోరెన్ రాక కాషాయ పార్టీకి ఓ ప్లస్ అయితే కొల్హాన్ ప్రాంతంలో బోణీ కొట్టాలంటే ఆయన అవసరం తప్పనిసరిగా మారడం మరో ఎత్తుగా మారింది. దీంతో చంపై సోరెన్ సాయంతో కొల్హాన్ ప్రాంతంలో జేఎంఎం జోరును అడ్డుకోవాలని బీజేపీ భావిస్తోంది.

కొల్హన్ ప్రాంతంతో పాటు మొత్తం జార్ఖండ్లో బీజేపీకి అనుకూలంగా వేవ్ నడుస్తోందని చంపై సోరెన్ చెప్తున్నారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. నవంబర్ 13న మొదటి దశలో ఎన్నికలు జరగనున్న 43 నియోజకవర్గాలలో కీలకమైన సరైకేలాలో చంపై సోరెన్ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ సోరెన్ బీజేపీలోకి రావడంతో బీజేపీలో ఉన్న గణేష్ మాహ్లీ జేఎంఎంలోకి మారి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో పాత ప్రత్యర్దుల మధ్యే పోరు సాగనుంది.












Click it and Unblock the Notifications