కుమార స్వామి ప్రమాణస్వీకారం.. సంకట స్థితిలో తెలుగు ముఖ్యమంత్రులు..
కుమార స్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇబ్బందికరంగా మారింది. జేడీయస్ పార్టీకి చెందిన కుమార స్వామి ముఖ్యమంత్రి పీఠం అదిరోహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికి కాంగ్రేస్ పార్టీతో జతకట్టే అంశమే సమస్యగా మారింది. దీంతో ఒకే వేదిక మీద కాంగ్రేస్ నేతల మద్య ఎలా గడపాలా అని తెలుగు ముఖ్యమంత్రులు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. చంద్రబాబుతో పాటు కేసీఆర్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లకుండా ఉంటేనే మంచిదనే నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు ముఖ్యమంత్రులకు ఇబ్బందికర పరిస్ధితులు..
కర్ణాటక లో కుమార స్వామి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ తన విధేయతను చాటుకున్నారు జేడీయస్ చీఫ్. ఈ నెల 24న అట్టహాసంగా జరిగే ప్రమాణ స్వీకారానికి దేశ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నేతలను ఆహ్వానించాలని జేడీయస్ ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగా ఏపి నుండి చంద్రబాబును, తెలంగాణా నుండి చంద్రశేఖర్ రావును ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇంత వరకు కథ బాగానే ఉన్నా తెలుగు ముఖ్యమంత్రులు మాత్రం ప్రమాణ స్వీకారానికి వెళ్లే అంశం పట్ల సందిగ్దత వ్యక్తం చేస్తున్నారు. జేడీయస్ ఆహ్వానాన్ని తిరస్కరించే అవకశాలు ఏ కోశానా నేనప్పటికి ఆ పార్టీ జతకడుతున్నది కాంగ్రెస్ పార్టీతో కాబట్టి అసలు సమస్య అక్కడే మొదలవుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడతో చంద్రబాబు నాయుడుకు మంచి సంబంధాలు ఉన్నాయి. 1996 లో దేశ 11వ ప్రధాన మంత్రిగా పాలన కొనసాగించేందుకు అప్పటి థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు తన పూర్తి సహకారాన్ని అందించారు. ఈ పరిణామాలన్నీ అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేపట్టినవే. అందులో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంటుండేది.
ఇటు మిత్ర ధర్మం.. అటు శత్రుత్వం.. వేదికను ఎలా పంచుకోవాలి..
తాజాగా కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ కి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదని కర్ణాటక తెలుగు ప్రజానికానికి తేల్చి చెప్పారు చంద్రబాబు. దీంతో పరోక్షంగా జేడీయస్ పార్టీకి అనుకూలంగా బాబు ప్రకటన రూపాంతరం చెందింది. అంతే గాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం కన్నడిగులు ఓటు వేయాలని బాబు ఎక్కడా చెప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నాయుకురాలు సోనియా గాంధీ ఆమె తనయుడు రాహుల్ గాంధీతో వేదికను పంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ రాజకీయాల్లో బద్ద శత్రువులుగా కొనసాగిన చంద్రబాబు, కాంగ్రెస్ ముఖ్యనేతలు ఒకే వేదికపై ఆసీనులౌతారా ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే అంశంలో చంద్రబాబు నాయుడు తర్జన బర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. అటు చూస్తే దేవెగౌడ కుంటుంబంతో ఎప్పటినుండో మంచి మిత్రత్వం, ఇటు చూస్తే కాంగ్రేస్ పార్టీతో ఏళ్ల తరబడి శత్రుత్వం. ఒకవేళ చంద్రబాబు కుమార స్వామి ప్రమాణస్వీకారానికి హాజరైతే పరిణామాలు ఎలా ఉంటాయో నని బాబు కోటరీలో సుధీర్గ చర్చలు జరుగుతున్నాయి. అన్ని పరిణామాలను అదిగమించేందుకు ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరయితేనే శ్రేయస్కరమనే చర్చకూడా జరుగుతోంది.
అంతా కేసీఆర్ భావించినట్టే జరిగింది. కాని ప్రమాణ స్వీకారానికి వెళ్లలేని పరిణామాలు..
ఇవే పరిస్థితులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎదురౌతున్నాయి. కేసీఆర్ కర్ణాటక ఎన్నికలకు ముందు ఒకడుగు ముందుకేసి, కర్ణాటక వెళ్లి దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు కుమార స్వామిని సంప్రదించారు. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా తాను ఏర్పటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు మద్దత్తు తెలపాల్సిందిగా కోరారు. రాబోవు రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశ ప్రధానుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయని కుండబద్దలు కొట్టనట్టు చెప్పారు. అవసరమైతే తాను జేడీయస్ తరుపున కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తానని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపిలకు ఎలాంటి పరిస్తితుల్లో ఓటు వేయకూడదని కన్నడిగులకు పిలుపు కూడా ఇచ్చారు కేసీఆర్. కేసీఆర్ వందకు వంద శాతం ఊహించిందే కర్ణాటకలో జరిగింది., కాని కాంగ్రేస్ తో జతకట్టి జేడియస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కేసీఆర్ కు కంటిలో నలుసులా పరిణమించింది. ఇదే తరుణంలో మంచి మిత్రత్వం ఏర్పరుచుకున్న కేసీఆర్ కు కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరు కావల్సిందిగా ఆహ్వానం కూడా అందింది.
ప్రమాణస్వీకారానికి వెళ్లకుండా ఉంటేనే శ్రేయస్కరం..
ఈ మద్య కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న కేసీఆర్ ప్రమాణ స్వీకార వేదిక మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను పలకరించకుండా, తెలంగాణ ఇచ్చింనందుకు విధేయత చూపకుండా ఉండగలరా ? జాతీయ పార్టీల మీద ముఖ్యంగా కంగ్రెస్ పార్టీ మీద నిప్పులు చెరుగుతున్న కేసీఆర్ అసలు వేదికను వారితో పంచుకోగలరా ?? ఉద్వేగభరిత తటస్థ వేదికమీద కంగ్రేస్ అతిరథులతో పాల్గొని ఆశ్యర్యపరుస్తారా ? లేక కార్యక్రమానికి వెళ్లకుండా ఉంటారా ? అన్నదే ప్రశ్నగా మారింది.దీంతో కార్ణాటక లో కుమార స్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులను ఇరకాటంలో పెట్టే అంశంగా పరిణమించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు మిత్రబంధానికి లోబడి హాజరౌతారా లేక శత్రుధర్మానికి కట్టుబడి దూరముంటారా చూడాలి.