చెన్నై టు ఢిల్లీ: జయతో బాబు 45ని.లు, కారత్తో జగన్
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో అనుసరించాల్సిన పద్ధతిని కాంగ్రెసు పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉల్లంఘించిందని ఆరోపించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి సీమాంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇరు ప్రాంతాల సంతృప్తి మేరకే విభజన జరిగిందన్నారు. ఇప్పుడు జరుగుతున్న విభజన అలా లేదన్నారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కై విభజనకు పూనుకున్నాయని ధ్వజమెత్తారు.
కరుణానిధితో భేటీ
జయలలితతో భేటీ అనంతరం చంద్రబాబు డిఎంకె అధ్యక్షులు కరుణానిధితో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.రాష్ట్రాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని తమ ఆవేదన ను అర్థం చేసుకున్నారని అన్నారు.
మరోవైపు ఢిల్లీలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. విభజనను అడ్డుకోవాలని సిపిఎం నేతలను జగన్ కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా కాంగ్రెసు విభజన చేస్తోందని, సమైక్య రాష్ట్రానికి సహకరించాలని కోరారు.
అనంతరం ప్రకాశ్ కారత్ విలేకరులతో మాట్లాడుతూ.. విభజన దేశానికి చేటు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. మెజారిటీ ప్రజల అభ్యంతరాలను, రాష్ట్ర ఉభయసభల నిర్ణయాలను పట్టించుకోకుండా విభజన అంటే సరికాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.