చెన్నై వరదలు: ఇతర నగరాలకు వెళ్లడంపై సాఫ్టువేర్ కంపెనీల డైలమా
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై పైన జలఖడ్గం పంజా విసిరింది. రెండు రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో 119 సెంటీమీటర్ల వర్షం కురుసింది. చెన్నై విమానాశ్రయం, బస్టాండ్లు రైల్వే స్టేషన్లు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు వాగుల్లా మారిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెన్నైలో ఎక్కడకు వెళ్లాలన్నా ఇప్పుడు పడవలో వెళ్లాలి. భారీ వర్షానికి సాఫ్టువేర్ పరిశ్రమ వర్షాలకు కుదేలవుతోంది. చెన్నైలోని ఐటీ పరిశ్రమలు ఇతర నగరాలకు మకాం మార్చే దిశగా ఆలోచన చేస్తున్నాయి. వర్షాలతో ఈ సంస్థలు విసుగెత్తిపోయాయి.
ఐటీ పరంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతమంతా నవంబరు నెలలో వర్షంలో తేలియాడుతుండటమే కారణం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చెన్నై ఐటీ పరిశ్రమ అస్తిత్వాన్నే దెబ్బతీసేలా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చెన్నై ఐటీ కారిడార్లో కొన్ని వేల సంస్థలుండగా, లక్షలమంది ఉద్యోగులు పని చేస్తుంటారు.

చిన్నాచితకా సంస్థలు కాకుండా బాగా పేరున్న ఐటీ సంస్థలే ఈ కారిడార్లో రెండు వేల వరకు ఉన్నాయి. ఐటీ పరిశ్రమలో మొత్తం 3.75 లక్షల మంది పని చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఐటీ ఎగుమతుల్లో చెన్నై వాటా రూ.75 వేల కోట్లు. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, హెచ్సీఎల్, విప్రో, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఉన్నాయి.
ఇప్పుడు అక్కడి ఐటీ సంస్థలు అన్నీ డైలమాలో పడ్డాయని అంటున్నారు. నవంబరు నెలంతా ఐటీ సంస్థల కార్యాలయాలు అంతగా పని చేయలేదు. సిబ్బంది అవస్థలు పడాల్సి వచ్చింది. వర్షాలు వస్తే ఈ ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
ఇక ఉద్యోగులు కూడా ఆ పరిసర ప్రాంతాలైన తాంబరం, వేళచ్చేరి, అడయార్, కోట్టూరుపురం, మణిమంగళం, ముడిచూరు, మరిమలైనగర్, తిరువాన్మియూర్ తదితర ప్రాంతాల్లో నివసిస్తారు. ఇవన్నీ నిజానికి లోతట్టు ప్రాంతాలే. ఒకప్పుడు చెరువులు, తటాకాలే. ఇప్పుడు ఆవాసాలుగా ఐటీ కారిడార్గా అభివృద్ధి చెందింది.
ఈ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. ఇంట్లో ఉంటే కార్యాలయానికి, కార్యాలయంలో ఉంటే ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చేయమని కొన్ని చెబితే, కొన్ని సంస్థలు వీలైతే బెంగళూరు వెళ్లాలని కూడా సూచిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి.
ఇదిలా ఉండగా, హెచ్సీఎల్, టిసిఎస్, విప్రో తదితర సంస్థలు తమ ఉద్యోగులకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు, తాజా వర్షాల ప్రభావం దేశవ్యాప్తంగా వాహన రంగంపై పడనుంది. వర్షాల కారణంగా చెన్నై శివార్లలో ఉన్న వాహన తయారీ ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి.












Click it and Unblock the Notifications