దావూద్తో లింక్: పోలీసుల పేర్లు చెప్పిన ఛోటా రాజన్
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అందుకే ఛోటా రాజన్ ను ముంబై తరలించకుండా ఢిల్లీలోనే పెట్టాలని సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దావూద్ ఇబ్రహీంతో ముంబై పోలీసు అధికారులు చాల మంది కుమ్మక్కు అయ్యారని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
పాకిస్థాన్ లో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులు నిత్యం టచ్ లో ఉన్నారని, వారికి డీ గ్యాంగ్ నుంచి మామూళ్లు అందుతున్నాయని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు చెప్పాడు. ఛోటా రాజన్ మీద ముంబైలో దాదాపు 75 కేసులు ఉన్నాయి.
అందులో హత్యలు, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్ లు తదితర కేసులు ఉన్నాయి. అయితే బాలిలో ఛోటా రాజన్ భారత్ బయలుదేరిన వెంటనే ముంబైలో నమోదు అయిన కేసులు అన్ని సీబీఐకి అప్పగిస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ అహమ్మద్ జావేద్ మీడియాకు చెప్పారు.
ఛోటా రాజన్ సీబీఐ కస్టడికి
శనివారం ఛోటా రాజన్ ఢిల్లీలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఐదు రోజుల పాటు విచారణ చెయ్యడానికి సీబీఐకి అనుమతి ఇచ్చారు. ఛోటా రాజన్ ను ఐదు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.