చైనాతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటాం, ట్రంప్ మధ్యవర్తిత్వంపై అమిత్ షా నో కామెంట్..
సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతోన్న డ్రాగన్ చైనా అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. చైనాతో ఉన్న సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. లడాఖ్ భూభాగంలో చైనా చొచ్చుకురావడంతో యుద్ధమేఘాలు అలుముకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యపై ఇరుదేశాలు చర్చించుకొని పరిష్కరించుకుంటాయని తెలిపారు. ఇందులో మరో దేశం జోక్యానికి తావులేదని కుండబద్దలు కొట్టారు.
Recommended Video
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనా-భారత్ సమస్యపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తారని.. మీడియా ప్రతినిధి అడగగా.. దీనిపై తాను కామెంట్ చేయబోనని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తమ అంతర్జాతీయ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని, ఉంటాయని షా పేర్కొన్నారు.
భారతదేశ సరిహద్దు భద్రత తమకు ప్రయారిటీ అని.. ఎలాంటి హానీ కలిగించబోనీయమని పేర్కొన్నారు. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ఇతరులు ఉల్లంఘించడానికి ప్రభుత్వం అనుమతించబోదని అన్నారు. చైనాతో గల వివాదాన్ని తామే ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని అమిత్ షా స్పష్టంచేశారు.