తెగబడ్డ చైనా... ఐదుగురు భారతీయుల కిడ్నాప్... అరుణాచల్ భూభాగంలోకి డ్రాగన్ ఆర్మీ...
అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నినొంగ్ ఎరింగ్ వెల్లడించారు. చేపలకు వేటకు వెళ్లిన సమయంలో వారిని కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. చైనా దురాగతాలకు గట్టిగా బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కిడ్నాప్ అయిన ఐదుగురి పేర్లను తను బకర్,ప్రసత్ రింగ్లింగ్,ఎన్గరు దిరి,దొంగ్తు ఎబియా,తోచ్ సింగ్కమ్గా వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్లోని సుబన్సిరి జిల్లాలో ఇండియా-చైనా సరిహద్దు వెంబడి ఉన్న సెరా 7 ప్రాంతం నుంచి వీరిని కిడ్నాప్ చేసినట్లుగా చెబుతున్నారు. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
SHOCKING NEWS: Five people from Upper Subansiri district of our state Arunachal Pradesh have reportedly been ‘abducted’ by China’s People’s Liberation Army (PLA).
— Ninong Ering (@ninong_erring) September 4, 2020
Few months earlier,a similar incident happened. A befitting reply must be given to #PLA and #CCPChina. @PMOIndia https://t.co/8gRdGsQfId pic.twitter.com/KbDMJ3bUi2
అరుణాచల్ భూభాగంలోకి చైనా ఆర్మీ...
పాసిఘాట్ వెస్ట్కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నినొంగ్ ఎరింగ్ మాట్లాడుతూ... చైనా మళ్లీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తోందన్నారు. లదాఖ్,డోక్లాం తరహాలో అరుణాచల్ ప్రదేశ్లోనూ దురాక్రమణలకు తెగబడుతోందన్నారు. చైనా బలగాలు ఇప్పటికే వాస్తవాధీన రేఖను దాటి భారత్ వైపుకు చొచ్చుకొచ్చాయని అన్నారు. చైనా ఇలా చేయడం ఇది రెండోసారి అని చెప్పారు. చైనా ఆగడాలను నినొంగ్ ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ,అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు దృష్టికి తీసుకెళ్లారు. కిడ్నాప్కి గురైన ఐదుగురిలో ఒకరైన ప్రసత్ రింగ్లింగ్ సోదరుడు ప్రకాష్ రింగ్లింగ్ ఫేస్బుక్ పోస్టును కూడా తన ట్వీట్కు జతచేశారు. చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినవారిలో తన సోదరుడు కూడా ఉన్నాడని ప్రకాష్ రిగ్లింగ్ అందులో పేర్కొన్నారు. భారత అధికారులు తక్షణం స్పందించి తన సోదరుడితో పాటు కిడ్నాప్ అయిన మిగతా నలుగురిని వెనక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని...
భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే నినొంగ్ కూడా విజ్ఞప్తి చేశారు. అది మన ప్రాచీన భూభాగమని... దానిపై మన ప్రజలకే హక్కు ఉందని తెలిపారు. లదాఖ్లో ఉద్రిక్తతల నుంచి దృష్టి మళ్లించేందుకే చైనా అరుణాచల్ ప్రదేశ్ను టార్గెట్ చేసిందన్నారు.'సరిహద్దును ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని వందల కి.మీ భూభాగానికి కాపలా లేదు. ఆ ప్రాంతాలకు చేరుకోవాలంటే కొన్నిసార్లు 15 రోజుల పాటు నడుచుకుంటూ వెళ్లాలి. ఐటీబీపీ వాటికి కాపలాగా ఉంటోంది. ఇప్పటికే అక్కడ అదనపు బలగాలను మోహరించారు.' అని చెప్పుకొచ్చారు.
Recommended Video
పోలీసులు ఏమంటున్నారు...
అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కిరణ్ రిజిజుకు కూడా ఈ విషయం తెలుసునని... దీన్ని ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కిడ్నాప్ ఉదంతంపై సుబన్సిరి ఎస్పీ తరు గుస్సార్ మాట్లాడుతూ... సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. అయితే ఇందులో నిజానిజాలేంటన్నది తేలాల్సి ఉందన్నారు. ఇప్పటివరకూ ఎవరి నుంచి తమకు ఫిర్యాదు అందలేదన్నారు.
డిప్యూటీ కమిషన్ కాంతో డాంజెన్ మాట్లాడుతూ... 'అవి జనావాసాలు లేని ప్రాంతాలు. నాచో పట్టణం నుంచి కాలి నడకన అక్కడికి చేరుకునేందుకు కనీసం 11 రోజులు పడుతుంది. కాబట్టి అక్కడినుంచి సమాచారం అంత సులువు కాదు. కేవలం ఆర్మీ మాత్రమే దీనిపై సమాచారం ఇవ్వగలదు.' అని చెప్పుకొచ్చారు.