మాస్కో వేదికగా భారత్-చైనా చర్చలు- సిద్ధమైన ఇరుదేశాల రక్షణ, విదేశాంగమంత్రులు..
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రష్యాలో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య సదస్సు వేదికగా మారబోతోంది. ఇరుదేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి మూడు నెలలుగా సాగుతున్న ఈ ప్రతిష్టంభనకు తెరదించేందుకు మాస్కోలో భేటీకి డ్రాగన్ దేశం ఆహ్వానించగా.. దానికి భారత్ కూడా అంగీకారం తెలిపింది. సదస్సు సందర్భంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు భేటీ అయి వివిధ అంశాలపై చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కేంద్రం కూడా సానుకూల సంకేతాలు పంపుతోంది.
రష్యా వేదికగా భారత్-చైనా చర్చలు..
భారత్-చైనా మధ్య మూడు నెలలుగా సాగుతున్న సరిహద్దు ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు మరో వేదిక సిద్ధమైంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య మిలిటరీ అధికారుల స్ధాయిలో చర్చలు జరుగుతున్నా వాటి ఫలితంతో సంబంధం లేకుండా ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో రష్యా మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని చైనా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య భేటీ దీనికి వేదిక కానుంది. ఇందులో పాల్గొనేందుకు ఇరుదేశాల రక్షణ, విదేశాంగశాఖల మంత్రులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ప్రధాన అజెండా పూర్తయ్యాక ఇరుదేశాల మంత్రులు వేర్వేరుగా శాఖల వారీగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవాళ రక్షణ మంత్రుల భేటీ...
మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య సదస్సులో ముందుగా భారత్-చైనా రక్షణమంత్రులు సరిహద్దు వివాదాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కు చైనా రక్షణమంత్రి వీ నుంచి ఆహ్వానం అందింది. సరిహద్దు తగాదాలపై చర్చలు కేంద్రం నుంచి సానుకూలత ఉండటంతో రాజ్నాథ్ దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇవాళ స్కో సదస్సులో భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ కానున్నారు. ప్రధాన సదస్సు పూర్తయ్యాక లేదా విరామ సమయంలో రక్షణ మంత్రులు తొలుత భేటీ అయిన ఇరువైపులా వాదనలు పంచుకోనున్నట్లు సమాచారం. అనంతరం వీటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఓ అంగీకారానికి రావాల్సి ఉంటుంది.
త్వరలో విదేశాంగమంత్రుల భేటీ...
అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ నుంచి అందిన అహ్వానానికి భారత విదేశాంగమంత్రి జై శంకర్ కూడా సై అన్నారు. స్కో సదస్సులో భాగంగా ఆయన సెప్టెంబర్ 10న చైనా విదేశాంగమంత్రి వాంగ్తో భేటీ కానున్నారు. చైనా ప్రతిపాదనపై స్పందిస్తూ చర్చల ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణ కోసం వర్చువల్ సభలో పాల్గొన్న జై శంకర్.. సరిహద్దుల్లో ప్రస్తుతం శాంతియుత పరిస్ధితులు ఉన్నాయని తాను చెప్పలేనన్నారు. అక్కడ యథాతథ పరిస్ధితులను భారత్-చైనా కూడా ఉల్లంఘించరాదన్నారు. సరిహద్దుల్లో ఏం జరిగినా వాటి ప్రభావం ఇరుదేశాలపై సంబంధాలపై పడుతుందన్నారు.