కర్నాటకలో చిరు ప్రచారం, రేపు బిజెపి తరఫున పవన్
బెంగళూరు: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి సోమవారం కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీమాంధ్ర ప్రాంతంలో మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో అంతకుముందే ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ చిరంజీవితో ప్రచారం చేయిస్తోంది. సోమవారం చిరు చిక్మగ్ళూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. చిరు రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో వీరప్ప మొయిలీని గెలిపించి తనకు బహుమతిగా ఇవ్వాలని ప్రజలను, అభిమానులను కోరారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అధికార దాహంతో పదవిని కోరుకుంటున్నారన్నారు. బిజెపివంటి మతతత్వ పార్టీలకు ఓటు వేస్తే లాభం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ అందరినీ కలుపుకొని వెళ్లే పార్టీ అన్నారు.
బిజెపి తరఫున రేపు పవన్ ప్రచారం
భారతీయ జనతా పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు కర్నాటకలో ప్రచారం చేయనున్నారని సమాచారం. రేపు ఉదయం కర్నాటకకు వెళ్లి బిజెపి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహిస్తారు.