భయం లేదు కానీ, సమయం పడుతుంది!: చిరంజీవి
న్యూఢిల్లీ: ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి భయానక వాతావరణం లేకపోయినప్పటికీ, పరిస్థితులు కుదుటపడేందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి నుండి చిరుకు పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో పరిస్థితిపై ప్రణబ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. దీనిపై చిరంజీవి స్పందిస్తూ... ప్రస్తుతం పరిస్థితి భయానకంగా ఏమీలేదని, సర్దుకోవడానికి మాత్రం కొంత సమయం పడుతుందని చెప్పారట.
కాగా, రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి చిరంజీవి అయ్యే అవకాశాలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చిరంజీవిని చేసి, భవిష్యత్తు కార్యాచరణను నడిపించి యోచనలో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర బాధ్యతలు చిరంజీవికి అప్పగించి ఆయన ప్రజాకర్షణను ఆయుధంగా చేసుకుని ఎన్నికలను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ మేరకు చిరంజీవితోపాటు రాష్ట్ర నేతలకు కూడా ఆ పార్టీ అధిష్ఠానం స్పష్టమైన సంకేతాలు పంపింది. సాధ్యమైనంత త్వరలోనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ముఖ్యమైన బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా మంగళవారం తనను కలిసిన కేంద్ర మంత్రి చిరంజీవికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రిగా కాపు వర్గానికి చెందిన చిరంజీవిని ఎంపిక చేస్తున్న నేపథ్యంలో అదే వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను దళిత వర్గాలకు చెందిన నేతకు అప్పగించే విషయంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర పిసిసి సారథ్య బాధ్యతలను మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్కు అప్పజెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా? కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే అంశంపై మంగళవారం సాయంత్రం వార్ రూమ్లో సీమాంధ్ర నేతలతో అధిష్ఠానం పెద్దలు సమావేశమై చర్చించారు.