ఆ వాహనాలపై కొత్త భారం: పెట్రోల్, డీజిల్ రేట్లే కాదు.. సీఎన్జీ ధరలు కూడా పెంపు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ఉత్పత్తులు, వంటగ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల సోమవారం దాకా కొనసాగింది. వంటగ్యాస్ సిలిండర్ల ధరను చమురు సంస్థలు 24 గంటల కిందటే సవరించాయి. ఒక్కో సిలిండర్పై 25 రూపాయల చొొప్పున అదనపు భారాన్ని మోపాయి. నాలుగే నాలుగు రోజుల వ్యవధిలో ఎల్పీజీ రేట్లను పెంచాయి. ఈ రేట్ల పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా- కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), గృహావసరాల కోసం వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) రేట్లను చమురు సంస్థలు భారీగా పెంచాయి. మంగళవారం తెల్లవారు జామున 6 గంటల నుంచి ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది.
పెరిగిన రేట్ల వివరాలిలా..
70 పైసల మేర సీఎన్జీ, 91 పైసల మేర పీఎన్జీ రేట్లను పెంచినట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ప్రకటించింది. దేశ రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) మొత్తానికీ సీఎన్జీ, పీఎన్జీని సరఫరా చేసే సంస్థ ఇది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు అనుబంధంగా పనిచేస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ ధరల పెంపు ఢిల్లీకి పరిమితమైంది. దశలవారీగా అన్ని నగరాల్లోనూ అమలు చేయనున్నాయి సహజవాయు సంస్థలు. కొత్తగా సవరించిన రేట్ల ప్రకారం- ఢిల్లీలో సీఎన్జీ రేటు 43.40కి పెరిగింది. పీఎన్జీ ధర 28.41కు చేరింది. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ ప్రకారం.. పీఎన్జీ ధరను వసూలు చేస్తారు.

నోయిడాలో కొత్త రేట్లు ఇవే..
సవరించిన రేట్ల ప్రకారం.. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లల్లో సీఎన్జీ కేజీ ఒక్కింటికి 49.08, కాన్పూర్, హమీర్పూర్, ఫతేపూర్లల్లో 60.50 రూపాయలకు చేరింది. ముజప్ఫర్పూర్, షమ్లీల్లో దాని ధర 57.25, కర్నాల్, కైథల్లల్లో 51.38 రూపాయలకు పెరిగింది. రెవారీ, కర్నాల్లల్లో పీఎన్జీ రేట్లు 28.46 రూపాయలు, ముజప్ఫర్పూర్, షమ్లీ, మీరఠ్లల్లో 32.67 రూపాయలకు చేరింది. ఢిల్లీ, ఎన్సీఆర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ముజప్ఫర్పూర్, కర్నాల్, రేవారీల్లో మొత్తం 16 లక్షల గృహాలకు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ గృహావసరాల కోసం పైప్ లైన్ ద్వారా గ్యాస్ను సరఫరా చేస్తోంది.

హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్..
హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లో గెయిల్కు అనుబంధంగా పనిచేస్తోన్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సైతం సీఎన్జీ, పీఎన్జీ ధరలను సవరించే అవకాశాలు లేకపోలేదు. నేడో, రేపో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. సీఎన్జీ, పీఎన్జీ రేట్లను సవరించాలంటూ గెయిల్ నిర్ణయం తీసుకున్న తరువాత.. దాని అనుబంధ సంస్థలన్నీ దానికి అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుంది. రేట్ల సవరణపై భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఇదివరకే కసరత్తు పూర్తి చేసింది. ఈ మూడు నగరాల్లో సీఎన్జీ, పీఎన్జీ రేట్లు పెరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications