బాదుడులో మరో అంకం- సీఎన్జీ రేట్లు భారీగా పెంపు
కేంద్రం ఇటీవలే పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచింది. లీటర్ పై రూ.3.50 పైసల మేర వడ్డించింది. ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చు. మున్ముందు వీటి రేట్లు భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పడిపోతోండటం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వచ్చే భారీ నష్టాలను పూడ్చుకోవడానికి వాహనదారులపై పడ్డాయి.
ఇప్పుడు తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు కూడా పెరిగాయి. కేజీకి రూపాయి చొప్పున పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. రెండు రోజుల్లో వీటి రేట్లు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్జీ ధర కేజీకి రూ. 80.09 పైసలకు చేరింది. నోయిడా, ఘజియాబాద్ వంటి నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో ఉండే వినియోగదారులు కేజీకి రూ. 88.70 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ధరల పెరుగుదల ఢిల్లీ- ఎన్సీఆర్ తో పాటు దేశవ్యాప్తంగా సీఎన్జీపై ఆధారపడిన ప్రైవేటు వాహనదారులు, క్యాబ్ ఆపరేటర్లు, వాణిజ్య రవాణా వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది వారి రోజువారీ బడ్జెట్పై అదనపు భారాన్ని మోపడమే కాకుండా, రవాణా, ఇంధన ఖర్చులు మరింత పెరగడానికి దారితీస్తుంది.
రెండు రోజుల కిందటే సీఎన్జీ రేట్లను పెంచింది కేంద్రం. కేజీకి రెండు రూపాయల చొప్పున పెంచింది. అప్పటికే ఢిల్లీలో సీఎన్జీ ధర కేజీకి రూ. 79.09, ముంబైలో రూ. 84కి చేరింది. ఇప్పుడు మళ్లీ బాదడంతో ఈ రెండు రోజుల్లో కేజీ సీఎన్జీపై మూడు రూపాయల అదనపు భారం పడినట్టయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఫిబ్రవరి చివరి నుండి ప్రపంచ ముడిచమురు ధరలు 76 శాతానికి పైగా పెరిగాయి.
ఇంధన ధరల పెంపుదల సాధారణంగా అన్ని రంగాలలో సరుకు రవాణాను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉత్పాదక వ్యయాలు రెట్టింపు అవుతాయి. వ్యవసాయం, తయారీ, సేవల వంటి కీలక రంగాలు తీవ్ర ఒత్తిళ్లకు గురి అవుతాయి. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతుంది. ఇప్పటికే అధిక ధరలతో సతమతమౌతున్న సామాన్యులపై ఇంధన రేట్ల పెంపుదలతో కష్టాలు రెట్టింపు కానున్నాయి.












Click it and Unblock the Notifications