అసహనంపై బ్రిటన్లో మోడీ: ప్రతిపక్షాల వ్యంగ్యం
న్యూఢిల్లీ: భారతదేశం గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీల జన్మస్థలమని, అక్కడ ఎటువంటి మత విద్వేషాలకు, అసహన ధోరణలకు తావులేదని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాలకు భద్రత కల్పించడానికి, భావ ప్రకటనా స్వచ్ఛకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
లండన్లో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రధాని మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత విద్వేషాలను, అసహన ధోరణులను సహించేది లేదని, ఇలాంటి పరిస్థితి దేశంలో ఏ మూల చోటుచేసుకున్నా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలను తేలిగ్గా పరిగణించే ప్రసక్తి లేదని, 125కోట్ల జనాభా కలిగిన భారత్లో ఇలాంటి చెదురుమదురు సంఘటనలకు ఆస్కారం ఉన్నప్పటికీ, ఏ ఒక్క సంఘటనను వదిలి పెట్టేది లేదని, అందుకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
‘మాకు సంబంధించినంత వరకూ ఇలాంటి మత అసహన, విద్వేష సంఘటనలు ఎంత చిన్నవైనా చాలా తీవ్రమైనవే. వేటిని వదిలి పెట్టేది లేదు. ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం' అని మోడీ తెలిపారు. రాజ్యాంగంలో పేర్కొన్న హక్కుల పరిరక్షణకై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
యుకేలో తాను ఎప్పుడు పర్యటించినా ఘన స్వాగతం లభించిందంటూ 2003లో తాను జరిపిన పర్యటనను మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ యూకే ప్రభుత్వం తన పర్యటనపై నిషేధం విధించలేదన్నారు.

ఇంతలో ఇద్దరు జర్నలిస్టులు మత అసహనం గురించి, గుజరాత్ అల్లర్ల గురించి ప్రస్తావించి ప్రధాని మోడీని కొంత మేరకు ఇబ్బందికర పరిస్ధితిని కల్పించారు. వారిద్దరి ప్రశ్నలకు మోడీ చాలా గట్టిగానే సమాధానం చెప్పారు.
కాగా, తాను యూకే ప్రధానిగా ఉన్న మొదటి రెండేళ్ల కాలంలో మోడీ పర్యటనను ఎందుకు అనుమతించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ దాటవేశారు. మోడీ అత్యధిక స్థాయి ప్రజాదరణ కలిగిన భారత ప్రధాన మంత్రి అని, ఆయనతో కలిసి ఇరు దేశాలను ద్వైపాక్షికంగా ముందుకు తీసుకెళ్లడంపైనే దృష్టి సారిస్తానని తెలిపారు.
ఇక, మత అసహనంపై ప్రధాని నరేంద్రమోడీ భారత్లో స్పదించకుండా బ్రిటన్లో స్పందించడంపై ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై నమ్మడానికి వీలులేదంటున్నారు. అసహనంపై గతంలోనే ఈ వ్యాఖ్యాలు చేసుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అంటున్నారు.
అసహనంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు సాక్షి, ఆదిత్యనాథ్, ప్రాచీలపై ప్రధాని మోడీ మాటలు కాకుండా, చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
No place for intolerance in India:Modi in UK. Unless words are backed by action against BJPs own Sakshi/Som/Adityanath/Prachi, it is hot air
— Prashant Bhushan (@pbhushan1) November 13, 2015 











Click it and Unblock the Notifications