ఢిల్లీలో మమత చక్రం, బెంగాల్లో ఘర్షణలు!: మాతో కలవాలని సోనియా గాంధీ
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ వైపు ఢిల్లీలో థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్లో గత మూడేళ్లుగా ఘర్షణలు కనిపిస్తున్నాయి.
Recommended Video
కేంద్రం వద్ద ఉన్న డేటాను చూస్తే గత మూడేళ్లుగా ఈ ఘర్షణలు పెరుగుతున్నట్లుగా ఉంది. 2015లో 27 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 5గురు చనిపోయారని సమాచారం. 2016 32 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2017లో ఈ సంఘటనలు 53కు పెరగగా 9 మంది చనిపోయారు.
2011 నుంచి 2014 మధ్య సరాసరిగా 20 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2012లో 23, 2013లో 24 చోటు చేసుకున్నాయి. 2011లో 15, 2014లో 16 చోటు చేసుకున్నాయి. అదే సమయంలో 2010లో లెఫ్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎక్కువే ఉన్నాయి. ఆ ఏడాది 21 సంఘటనలు చోటు చేసుకోగా, 6గురు చనిపోయారు.
సోనియా గాంధీని కలిసిన మమత
దేశంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని, మెజార్టీ స్థానాల్లో తాము బీజేపీతో పోటీ పడుతున్నామని, బీజేపీ బలం లేని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉందని, కొన్ని పరిణామాల కారణంగా తమ పార్టీ దెబ్బతిన్నదని, మళ్లీ పైకి లేచే శక్తి కాంగ్రెస్కు ఉందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను కలిసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చెప్పారని సమాచారం.
మమత గురువారం సోనియాను మర్యాదపూర్వకంగా కలిశారు. థర్డ్ ఫ్రంట్ వల్ల బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని, ఆ పార్టీని వ్యతిరేకించే ఏ పార్టీ అయినా తమతో కలిసి రావాలని చెప్పారని తెలుస్తోంది.
త్వరలో కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ఎన్నికలు జరగనున్నాయని, అక్కడ కాంగ్రెస్ పని తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోకి అందరూ వస్తారని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ ఉండాలని మమతా బెనర్జీ కూడా అభిప్రాయపడ్డారు.
బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్కు చోటివ్వాలన్న మమతా బెనర్జీ అభిప్రాయంతో సీపీఐ ఏకీభవించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యత కోసం మమతా చేస్తున్న కృషిపై స్పందించారు. బెంగాల్లో తృణమూల్తోనూ, కేరళలో కాంగ్రెస్తోనూ తమ పార్టీ నేరుగా తలపడుతోందనీ, అక్కడ సర్దుబాట్లు కుదరకపోయినా, మిగతా రాష్ట్రాల్లో అందుకు అవకాశముందన్నారు.