కరోనావైరస్: భారతదేశంలో సామాజిక రుగ్మతలా మారుతున్న కోవిడ్-19.. దీన్ని తొలగించడం ఎలా?
కోల్కతాకి చెందిన 68 సంవత్సరాల సత్య డియో ప్రసాద్కి కోవిడ్ లక్షణాలైన జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నట్లు గుర్తించారు. ఆయన కిడ్నీ సమస్యతో డయాలిసిస్ కోసం తరచుగా హాస్పిటల్కి వెళ్లిన సమయంలో కోవిడ్-19 సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.
కోల్కతా నుంచి 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని పూణే నుంచి అతని కూతురు అల్కా ప్రసాద్ తండ్రిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి అంబులెన్సు కోసం హెల్ప్ లైన్కి ఫోన్ చేశారు.
ఆమె ఫోన్ చేసిన మూడు గంటల తర్వాత వచ్చిన అంబులెన్సు సత్య ప్రసాద్ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఆపి పేషెంట్ని అంబులెన్సు దగ్గరకు రమ్మని చెప్పారు. అందులో డ్రైవర్ తప్ప వేరే సహాయకులు ఎవరూ లేరు.
ఆమె 62 సంవత్సరాల తల్లి అంబులెన్సు వరకు ఆయనను తెచ్చే పరిస్థితిలో లేరని, ఆమె డ్రైవర్ సహాయం కోసం ఎంత ప్రాధేయ పడినా అతను వెళ్ళలేదు.
"నేను కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని ముట్టుకోను’ అని డ్రైవర్ కచ్చితంగా చెప్పారు. అంబులెన్సు వరకు నడిచి రావల్సిందే" అని పట్టు పట్టారు.
ఏమి చేయాలో అర్ధం కాని స్థితిలో అతని కూతురు మళ్ళీ ఇంకొక హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వలంటీర్లు ఉన్న అంబులెన్సు వచ్చి ఆ సాయంత్రానికి డియోని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు.
ఆయనను హాస్పిటల్లో చేర్చడానికి ఒక రోజు పట్టింది. కోవిడ్-19 చుట్టూ అల్లుకున్న భయాలే దీనికి కారణమని అల్కా ప్రసాద్ అన్నారు.
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
పది లక్షలు దాటిన కోవిడ్-19 ఇన్ఫెక్షన్లతో, భారతదేశం కోవిడ్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. వైరస్ వ్యాప్తితో పాటు ప్రజల భయాలు, అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఇది దేశంలోని చిన్న పట్టణాలకు, గ్రామాలకు కూడా పాకుతోంది.
"భయం, అనుమానం మమ్మల్ని ముంచెత్తుతున్నాయి” అని కోల్కతాకి చెందిన ఒక గృహిణి ఎం మిత్ర అన్నారు. ఆమె తండ్రికి కూడా కోవిడ్ పాజిటివ్ సోకినట్లు గుర్తించారు.
ఈ సామజిక రుగ్మతలను డాక్టర్లు, కోవిడ్ సోకి కోలుకున్నవారు, వైద్య రంగంలో పని చేస్తున్న వైద్య సిబ్బంది కూడా చవి చూడాల్సి వస్తోంది.
"ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ పట్ల ఉన్న భయం, అసత్య ప్రచారం, సామజిక రుగ్మత ఒక పెద్ద సవాలుగా ఉందని” ఐక్య రాజ్య సమితి చెబుతోంది. భారతదేశంలో ఈ వ్యాధి చుట్టూ ఉన్న సాంఘిక భయం వలన కోవిడ్ సోకిన వారిని వివక్షతో చూస్తున్నారు.
దీంతో, చాలా మంది కోవిడ్ సోకినట్లు ధైర్యంగా చెప్పలేక, సమయానికి పరీక్షలు చేయించుకోవటం లేదు. దీంతో, హాస్పిటల్ లో చేరడం ఆలస్యమై, పరిస్థితులు చేతులు దాటిపోతున్నాయి.
క్వారంటైన్ పట్ల ఉన్న అనుమానాల వలన కూడా ఎవరైనా ఐసొలేషన్ నుంచి తిరిగి వస్తే వారిని వెలి వేసిన వారిలా చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో ముస్లిం మత సంస్థ తబ్లీఘి జమాత్లో కేసులు బయటపడినప్పుడు దేశంలో ఇస్లామోఫోబియా తీవ్రంగా పెల్లుబికింది.
ఇలాంటి సామాజిక ఒత్తిడి వలన వినాశకరమైన పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
జులై నెలలో పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఒక గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి నడుస్తున్న రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటుండగా స్థానికులు ఆమెని రక్షించారు.
సిలిగురిలో చాలా ప్రాంతాలలో, కోవిడ్ పాజిటివ్ సోకిన వారి ఇంటి ముందు వెదురుతో బారికేడ్లను నిర్మించారు.
కొన్ని ప్రాంతాలలో, “ప్రమాద హెచ్చరికలు’, 'కోవిడ్ ముందుంది’ లాంటి గుర్తులను కూడా పెట్టారు.
చాలా మందికి వైరస్ సోకిందంటే మరణ వాంగ్మూలంలా ఉందని, ఒక వేళ వైరస్ నుంచి తేరుకున్నప్పటికీ దీని చుట్టూ ఉన్న సామజిక రుగ్మతలతో చనిపోయేలా ఉన్నారని, కోవిడ్ కేర్ నెట్వర్క్ని నిర్వహించే డాక్టర్ అభిజిత్ చౌదరి చెప్పారు. ఆయన కొంత మంది స్వచ్చంద సహాయకులతో కలిసి కోవిడ్ పట్ల నెలకొన్న సామజిక రుగ్మతలు పోగొట్టేందుకు పని చేస్తున్నారు.
కొన్ని ఇళ్ల బయట, కొవిడ్ పాజిటివ్ రోగుల పేర్లతో స్టిక్కర్లు అంటించారు. "ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పనులు జరగలేదు. కోవిడ్ సోకితే ఏదో కళంకంలా చూసే సంస్కృతి పోవడానికి ఉద్యమం రావాలి” అని దిల్లీ కి చెందిన డాక్టర్ అంబరీష్ సాత్విక్ అన్నారు.
మృతదేహాల నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అనే భయంతో చాలా మంది కుటుంబ సభ్యుల మృత దేహాలను తీసుకుని వెళ్ళడానికి రావడం లేదని ముంబయి హాస్పిటల్లో ఒక కోవిడ్ వార్డ్ లో పని చేస్తున్న డాక్టర్ చెప్పారు.
ఎవరైనా కోవిడ్ తో చనిపోతే ఆ విషయాలను రహస్యంగా దాచి పెట్టి ఉంచుతున్నారని దిల్లీలో కొంత మంది పురోహితులు ఫిర్యాదు చేశారు.
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
26 సంవత్సరాల అమృత పాండా ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకడంతో సామాజికంగా దూరం అవ్వడం ఎలా ఉంటుందో ఆమె స్వయంగా అనుభవించారు. వారిలో చాలా మందికి తేలిక పాటి లక్షణాలుండటంతో హౌరా లో ఒక ఇంట్లో క్వారంటైన్ లో పెట్టారు.
కానీ, ఆమె 82 సంవత్సరాల తాతగారికి ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో ఆయనను హాస్పిటల్కి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆయన అక్కడ చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు.
"మా నాన్నగారు, తాతగారు కోవిడ్ సోకి మరణించినట్లు మా చుట్టు పక్కల వదంతులు వ్యాపించాయి. ఇరుగు పొరుగు మా దగ్గరకు రావడం మానేశారు. మా ఇంటిలో పని చేస్తున్న పని మనిషిని కూడా మా ఇంటిలో పని మానకపోతే వాళ్ళ ఇళ్లకు రానివ్వమని ఇరుగు పొరుగు వాళ్ళు బెదిరించారు. దాంతో ఆమెను మేము పని నుంచి మాన్పించాల్సి వచ్చింది” అని ఆమె చెప్పారు.
"మా క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాత కూడా మా ఇరుగు పొరుగు మాతో కలవడాన్ని నిషేధించారు”.
“ఒక స్థానిక బ్యాంకు మా నాన్నగారిని లోపలికి అడుగు పెట్టనివ్వలేదు”.
"కోవిడ్ వచ్చిందంటే ఏదో నేరం చేసినట్లే చూస్తున్నారు. మా పనుల మీద మేము బయటకు వెళితే కూడా 'చూడండి కోవిడ్ సోకిన వారు బయట తిరుగుతున్నారు’ అని రోడ్డు మీద ప్రజలు అరుస్తున్నారు” అని పాండా చెప్పారు.
ప్రభుత్వ అధికారి సంగీత బెనర్జీ బరువా నివాసముంటున్న ఖరీదైన అపార్ట్మెంట్లో కూడా ఆమె పాజిటివ్ సోకిందని తెలిసిన తర్వాత వివక్షకు గురయ్యారు. ఆమె ఒక క్వారంటైన్ కేంద్రంలో కొన్ని వారాల పాటు పని చేసిన తర్వాత ఆమెకి పాజిటివ్ సోకింది.
"నాకు చాలా తేలికపాటి లక్షణాలు కనిపించడంతో ఇంటికి వచ్చాను. కానీ మా పొరుగున డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు కూడా మా కిటికీలను మూసుకోమని, బాల్కనీ లోకి రావద్దని మా పై అరిచారు. మేము కోలుకున్న తర్వాత కూడా మా వలన ముప్పు పొంచి ఉందని ఇరుగు పొరుగు అనేవారు. మమ్మల్ని వెలి వేసినట్లే చూసారు.’’
జూన్ నెలలో బెంగళూరులో పని చేస్తున్న కోవిడ్ రోగులకు చికిత్స చేసే డాక్టర్ జగదీష్ హైర్మధ్ కుటుంబానికి దూరంగా ఉండటానికి వీలుగా తన హాస్పిటల్ దగ్గర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ ని అద్దెకి తీసుకోవాలని చూసారు. "నేను మధ్య తరగతి, లగ్జరీ అపార్ట్మెంట్ లు అన్నీ చూసాను, కానీ, నేను డాక్టర్ ని కావడంతో ఎవరూ అద్దెకివ్వడానికి అంగీకరించలేదు. ఈ మహమ్మారి ముగిసిన తర్వాత చూద్దాం అనే సమాధానమే ఎక్కువగా వినిపించింది” అని ఆయన చెప్పారు.
“స్థానికంగా ఉన్న కిరాణా కొట్టు, పాల దుకాణాల వారు హాస్పిటల్ సిబ్బందికి సరుకులు అమ్మడానికి ఒప్పుకోలేదు. హాస్పిటల్ ఆపరేటింగ్ రూమ్ లో పని చేసే టెక్నీషియన్ పనికి రావడానికి బస్సు ఎక్కితే హాస్పిటల్ సిబ్బంది బస్సు ఎక్కడానికి వీలు లేదని బస్సు లోంచి దిగిపొమ్మని చెప్పారు”.
"ఇది సాంస్కృతిక అంశం. ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేదు. ఇలాగే జరిగితే హాస్పిటల్ లో పని చేయడానికి కూడా ఎవరూ రారు” అని డాక్టర్ హైర్ మధ్ అన్నారు.
- కరోనావైరస్: గాలి ద్వారా వ్యాప్తి చెందడమంటే ఏంటి? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్స్పాట్గా మారిపోతుందా?
https://www.youtube.com/watch?v=7UZeD8mjATo&t=72s
వార్తా సంస్థలు ప్రసారం చేస్తున్న పై పై వార్తలు, ప్రభుత్వం నుంచి వస్తున్న బలహీనమైన సమాచార విధానం దీనికి కారణమని చాలా మంది భావిస్తున్నారు.
చాలా మీడియా నెట్ వర్కులు ఈ వైరస్ మనిషిని ఎలా చంపేస్తుందో మృత దేహాల గ్రాఫిక్స్ వేసే చూపించే కథనాలతో నిండిపోతున్నాయని, ఒక కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తి ఫిర్యాదు చేశారు.
వైరస్ చుట్టూ అల్లుకున్నభయం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే ఈ అనుమానాలకు కారణమని మాజీ కేంద్ర వైద్య కార్యదర్శి కె సుజాత రావు అన్నారు.
"ఒక వేళ ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకితే ప్రభుత్వం కానీ, వైద్య వ్యవస్థ కానీ సహాయం చేస్తాయనే నమ్మకం ప్రజల్లో కరువయింది. వైద్యం ఖర్చును భరించగలిగే శక్తి లేకపోవడం వలన చికిత్స అందదేమో అనే భయం కూడా చాలా మందిలో ఉంది. ఇది ఒక నిస్సహాయత నుంచి పుట్టిన భయం” అని ఆమె అన్నారు .
వీటి వెనక సాంస్కృతిక కారణాలు కూడా ఉంటాయని ఎబోలా సమయంలో తలెత్తిన అనుమానాలపై అధ్యయనం చేసిన ఎసి థాంప్సన్ అన్నారు. ఇది పోగొట్టడానికి స్థానిక నాయకులు, కోవిడ్ నుంచి కోలుకున్న వారు, సామాజిక కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
"ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన ముప్పు గురించి ప్రజలకు తెలియచేస్తున్నప్పుడు జాతీయ, సాంఘిక, సాంస్కృతిక పద్దతులను దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. కొత్త గా వచ్చే వ్యాధుల వలన పొంచి ఉన్న ముప్పును సరైన విధానంలో తెలియ చేయడం కూడా అవసరం” అని డాక్టర్ థాంప్సన్ అన్నారు.
ఇక భారతదేశంలో ఎంత ప్రభావితంగా చేస్తున్నారో అనే విషయంపై స్పష్టత లేదు. "కోవిడ్ 19 పట్ల ఉన్న సామజిక రుగ్మత వ్యాక్సిన్, చికిత్సకు కూడా కోలుకోవేమో అని భయంగా ఉంది అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లో మాజీ రీసెర్చ్ డైరెక్టర్ గా పని చేసిన ప్రదీప్ కృష్ణత్రే అన్నారు.
“ఇప్పటికీ భారతదేశంలో కుష్టు రోగాన్ని ఒక సామాజిక రుగ్మత లాగే చూస్తారని మర్చిపోవద్దు”.
Click here to see the BBC interactive
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్ల సీక్రెట్ డీల్: భారత్కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ హాట్ స్పాట్గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)