కేజ్రీవాల్ వైపే, మోడీపై అభిమానం: సిద్ధూ గురించి భార్య ఆసక్తికరం
ఢిల్లీ: బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి షాకిస్తూ... రాజీనామా చేసిన నవజ్యోతి సింగ్ సిద్దూ త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారు. సిద్ధూ రాజీనామా చేసిన అనంతరం ఏం జరిగిందనే ఆసక్తికర విషయాన్ని ఆయన సతీమణి వెల్లడించారు. ఆయన రాజీనామా చేశాక... కాంగ్రెస్ పార్టీ అతనిని తమ పార్టీలోకి ఆహ్వానించిందని చెప్పారు.
నేడో రేపో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్దూ పేరును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ సతీమణి మీడియాతో మాట్లాడారు. తన భర్తను కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించిందని చెప్పారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ అయితేనే బాగుంటుందని ఆయన భావించారన్నారు.
కాంగ్రెస్ కూడా మమ్మల్ని సంప్రదించిందని, అయితే, కెప్టెన్ అమరీందర్కు, ప్రస్తుతం పాలిస్తున్న బాదల్కు పెద్దగా తేడా లేదని, ఇద్దరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మేము పంజాబ్లో మార్పు కోరుకుంటున్నామని చెప్పారు. గడచిన పదేళ్లలో అకాళీలకు వ్యతిరేకంగా అమరీందర్ సింగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులు 11 ఉన్నాయని, అత్యంత కీలకమైన, దేశ భద్రతకు ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయన్నారు. అట్టారీ బార్డర్ చెక్ పోస్టు వద్ద సీసీటీవీ కెమెరాలు, స్కానర్ల ఏర్పాటు పూర్తి కాలేదని ఆరోపించారు.
2015 ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ను తీవ్ర విమర్శలు చేసిన సిద్దూ వీడియోలు నెట్లో హల్ చల్ చేస్తుండటంపై స్పందిస్తూ... దానిని చాలా తేలికగా తీసుకుంటున్నామన్నారు. ఆయన తను నమ్మిన విషయంపై నిబద్ధతతో ఉంటారని, ప్రధాని నరేంద్ర మోడీ అంటే, ఇప్పటికీ గౌరవం ఉందని, అయితే, బీజేపీ పైనే నమ్మకం పోయిందన్నారు. ఓ వ్యక్తిగా కేజ్రీవాల్ అంటే తన భర్తకు ఎంతో గౌరవం అన్నారు.