కాంగ్రెస్ ఢిల్లీ ప్లాన్, సిపిఎంతో జగన్ జత: బాబు కార్నర్?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని వ్యవహారాలపై కాంగ్రెసు నేతలు ఢిల్లీలో వ్యూహరచన చేసి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఎత్తులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నాయకులు పలువురు ఢిల్లీలో మకాం వేశారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో కలిసి ఆందోళనలను పెంచాలని చూస్తున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వారికి మార్గదర్శనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ బుధవారంనాడు దిగ్విజయ్ సింగ్ను కలిసి మంతనాలు జరిపారు.
తెలుగుదేశం పార్టీనే కాకుండా బిజెపిని కూడా ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటు సమావేశాలకు ముందే ప్రధాని మోడీకి లేఖ రాయడాన్ని అందులో భాగంగానే చూస్తున్నారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధపడిన గత తమ ప్రభుత్వాన్ని నిలదీసి, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన బిజెపి వ్యవహారాన్ని కాంగ్రెసు అధిష్టానం ఇప్పుడు ఓ అస్త్రంగా ఎంచుకుంది.
కాంగ్రెసు దాడులను ఎదుర్కోవడానికి టిడిపి, బిజెపి కూడా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి, టిడిపి పార్లమెంటు సభ్యులు బుధవారం ఉదయం సమావేశమై చర్చలు జరిపారు. ప్రత్యేక హోదా, విభజన బిల్లు హామీలను అమలు చేయించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని వారు అనుకున్నారు. ఆ పని మీదనే టిడిపి పార్లమెంటు సభ్యులు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, హామీల అమలు కూడా ఆలస్యం అవుతోందని వారు రాజ్నాథ్ సింగ్కు విన్నవించుకున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ వారికి హామీ ఇచ్చారు.

కాగా, తెలుగుదేశం, బిజెపిలపై కాంగ్రెసు నాయకులు బుధవారంనాడు తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి చంద్రబాబు రాష్ట్రానికి నిధులు తేవాలని వారన్నారు. రాజధానికి నిధులు లేకపోతే రాష్ట్ర సచివాలయానికి కడప కలెక్టర్ కార్యాలయాన్ని వాడుకోవాలని వారు సూచించారు. చంద్రబాబు ఫ్యాన్సీ, ఫాంటసీ కోరికలను పక్కన పెట్టి జరీబు భూములను వదిలేయాలని వారు సూచించారు. విభజన చట్టాన్ని బిజెపి వెనక్కి తీసుకోగలదా అని వారు అడిగారు. రాష్ట్రానికి ఆర్థిక లోటు ఉంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని వారన్నారు.
ఇదిలావుంటే, 14వ ఆర్ధిక సంఘం లెక్కలు వాస్తవ విరుద్ధమని కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. ఆర్ధిక సంఘం నిధులతో ఏపీకి ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. బుధవారం ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ పద్ధతి ప్రకారం రాష్ర్టాలకు నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ కోలుకోదని అన్నారు. అదేవిధంగా కేంద్రం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తన సొంత ప్రయోజనాలను పక్కనబెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై సమరం సాగించాలని పరిస్థితి ఉండడాన్ని కాంగ్రెసు వాడుకుని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తోంది. మిత్ర పక్షం కావడంతో చంద్రబాబు బిజెపితో కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి లేదు. కాగా, కాంగ్రెస్ ఎత్తులను తిప్పికొట్టడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎపికి ప్రత్యేక ప్యాకేజీ, తదితర అంశాలపై ఆయన కేంద్ర మంత్రులను కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
సిపిఎంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జత
ఎపి రాజధాని అంశాన్ని బిజెపిని ఇరకాటంలో పెట్టడానికి సిపిఎం కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. సకల హంగులతో కూడిన దేశ రాజధాని ఢిల్లీ కూడా లక్ష ఎకరాలు లేదని, టిడిపి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఎపి నూతన రాజధాని వ్యవహారమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమేనని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు చేస్తున్న పోరాటానికి తాము మద్దతు తెలుపుతామని ఆయన బుధవారంనాడు తనను కలిసిన ఎపి రాజధాని రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ నాయకులు అంబటి రాంబాబు, లక్ష్మణ రెడ్డిలకు హామీ ఇచ్చారు.
ఎపి రాజధాని కోసం భూసేకరణ పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుగుణంగా సాగుతోందని ఏచూరి సీతారాం అభిప్రాయపడ్డారు. బిజెపి మినహా దేశంలోని పార్టీలన్నీ భూసేకరణ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు. రాజధానికి భూసేకరణ విషయంలో చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిపిఎంతో జత కట్టినట్లు కనిపిస్తోంది.
శరద్ యాదవ్ మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు తాము పూర్తి మద్దతు ఇస్తామని జెడి(యు) నేత శరద్ యాదవ్ చెప్పారు. ఆయనను బుధవారంనాడు ఎపికి చెందిన పార్లమెంటు సభ్యులు కలిశారు. ఎపికి ఇచ్చిన హామీలను బిజెపి నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications