జయనగర, ఆర్ఆర్ నగర ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు, బీజేపీకి దెబ్బ, రెండుసీట్లు మనకే !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యింది. బుధవారం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. ఈ సందర్బంలో బెంగళూరులోని జయనగర, ఆర్ఆర్ నగర శాసన సభ నియోజక వర్గాల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసి రెండు సీట్లు కైవసం చేసుకోవాలని నాయకులు చర్చలుజరిపారు. బీజేపీని ఒంటరి చేసి రెండు ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించాలని ప్లాన్ వేశారు.
కాంగ్రెస్, జేడీఎస్
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు మే 15వ తేదీ ప్రకటించారు. బీజేపీకి 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 78 ఎమ్మెల్యే స్థానాలు, జేడీఎస్ కు 38 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేల సంపూర్ణమద్దతు లేదు.
బీజేపీ చిత్తు
మే 17వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడ్యూరప్ప మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో మూడురోజులకే సీఎం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ ఎత్తులను చిత్తుచేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఇప్పడు పొత్తు పెట్టుకుని కర్ణాటకలో అధికారంలోకి వస్తున్నాయి.
బీజేపీకి నో చాన్స్
బెంగళూరులోని జయనగర బీజేపీ ఎమ్మెల్యే విజయకుమార్ ఆకస్మికమరణంతో అక్కడ ఎన్నికలు వాయిదాపడ్డాయి. రాజరాజేశ్వరినగర (ఆర్ఆర్ నగర)లో 9,000 ఓటరు గుర్తింపు కార్డులు అపార్ట్ మెంట్ లో బయటపడటంతో అక్కడా ఎన్నికలు వాయిదాపడ్డాయి.
జయనగరలో కాంగ్రెస్
జయనగర శాసన సభ నియోజక వర్గంలో జూన్ 11వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ చేస్తున్నారు. జయనగరలో సౌమ్య రెడ్డికి జేడీఎస్ అభ్యర్థి మద్దతు తెలపాలని నిర్ణయించారు. జయనగరలో ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. జూన్ 16వ తేదీన జయనగర ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
మునిరత్నకు హ్యాండ్
రాజరాజేశ్వరినగర (ఆర్ఆర్ నగర)లో కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న పోటీలో ఉన్నారు. జేడీఎస్ నుంచి సీహెచ్. రామచంద్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థి సీహచ్. రామచంద్రకు మునిరత్న మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీ నుంచి మునిరాజు గౌడ పోటీ చేస్తున్నారు. మే 28వ తేదీన ఇక్కడ ఎన్నికలు, మే 31వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.