బీజేపీ షాక్: బెంగళూరు మేయర్ కుర్చిలో కాంగ్రెస్
బెంగళూరు: బీజేపీ నాయకులు పెద్ద షాక్ కు గురైనారు. బృహత్ బెంగళూరు మహానగర నగర పాలికె (బీబీఎంపీ) మేయర్ కుర్చి కైవసం చేసుకోవాలని కలలుకన్న కమలనాథులకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పెద్ద షాక్ ఇచ్చాయి.
బీబీఎంపీ మేయర్ గా ప్రకాష్ నగర వార్డు కార్పొరేటర్ పద్మావతి (కాంగ్రెస్), ఉప మేయర్ గా రాధకృష్ణ వార్డు కార్పొరేటర్ ఆనంద్ (జేడీఎస్) ఎన్నిక అయ్యారు. బుధవారం బీబీఎంపీ కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మావతి బరిలోకి దిగి మేయర్ అయ్యారు. బీబీఎంపీలో బీజేపీకి మొత్తం 125 ఓట్లు, కాంగ్రెస్ కు 110, జేడీఎస్ కు 23 ఓట్లతో పాటు 9 మంది స్వతంత్ర అభ్వర్థులు ఉన్నారు.
గత సంవత్సరం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి మేయర్, ఉప మేయర్ పదవులు చేపట్టాయి. ఈ సారి బీజేపీ ఎలాగైనా మేయర్ పదవి కైవసం చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే సీన్ రివర్స్ అయ్యింది.
సమావేశానికి ఆలస్యంగా వచ్చిన బీజేపీ ఎంపీ, శాసన సభ్యులు ఓటు వెయ్యడానికి ఎన్నికల అధికారి అనుమతి ఇవ్వకపోవడంతో సభలో వాదోపవాదాలు జరిగాయి. గొడవ జరుగుతున్న సమయంలో మేయర్ ఎన్నిక పూర్తి అయ్యింది.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని బీజేపీ నాయకులు ఆరోపించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన సభ్యుడు (బీజేపీ) ఆర్. ఆశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా బెంగళూరు మేయర్ పదవి కైవసం చేసుకుందని మండిపడ్డారు.
ప్రజా ప్రతినిధులు ఓటు వెయ్యకుండా కాంగ్రెస్ రాజకీయం చేసిందని ఆరోపిస్తూ డిప్యూటీ మేయర్ ఎన్నికలను బహిష్కరించారు. బీజేపీ నాయకులు ఎన్నికల అధికారి ఉన్న కుర్చి మీదకు పేపర్లు విసిరి నిరసన వ్యక్తం చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.