VCK కు ఉన్నది ఇద్దరు ఎమ్మెల్యేలు: డిప్యూటీ సీఎం కావాలంటూ పట్టు.. !!
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్న కొద్దీ అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటోన్నాయి. విడుదలై చిరుతైగల్ కచ్చి (VCK) పైనే ఇప్పుడు అందరి చూపూ నిలిచింది. ఈ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు 118 మంది సభ్యుల బలం అవసరం కాగా.. ప్రస్తుతం ఇది 116 వద్ద నిలిచిపోయింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే తొలుత టీవీకేకు మద్దతు ప్రకటించినప్పటికీ- ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం అనూహ్యం.
ఈ పరిణామాల మధ్య నూతనంగా ఎన్నికైన వీసీకే ఎమ్మెల్యే వన్ని అరసు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు థోల్ తిరుమావళన్ ఉపముఖ్యమంత్రే కాకుండా, ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. మంత్రి పదవులపైనా ఆయన స్పందించారు. అధికారంలోనూ, పాలనలోనూ వాటా అనేది తమ దీర్ఘకాలిక ఆశయమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి దీనికి ఒక స్పష్టమైన రూపాన్ని ఇస్తోందని, తమిళ ప్రజలు దీనికోసమే తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. తిరుమావలన్ మార్గదర్శకత్వంలోనే టీవీకే మద్దతుపై నిర్ణయం తీసుకుంటాం. ఆయన అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని వన్ని అరసు వ్యాఖ్యానించారు. తాను ఓ సాధారణ కార్యకర్తనని, శాసనసభ సభ్యుడినయ్యే గొప్ప అవకాశాన్ని తిరుమావళనే కల్పించారని, ఆయన ఉపముఖ్యమంత్రి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశముందని తేల్చి చెప్పారు.
అదే సమయంలో వన్ని అరసు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ క్రిప్టిక్ పోస్ట్ పెట్టారు. "పాలనలో, అధికారంలో వాటా తప్పదు. ఇది తిరుమావళన్ కాలం. ఇకపై మరింత ఎదుగుతాం" అనేది దాని సారాంశం. ఈ పోస్ట్ ఉప ముఖ్యమంత్రి ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. వీసీకే ప్రధాన కార్యదర్శి సెల్వన్ కూడా తన ఎక్స్ లో దాదాపుగా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. తమిళనాడులో అయోమయంలో ఉందని, తిరుమావళన్ ఇచ్చే స్పష్టతపైనే ఆధారపడి ఉందని, రేపటి ఉదయం మన కోసమేనని అన్నారు.
234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో వీసీకేకు ఉన్న బలం.. రెండు సీట్లే. వారిలో వన్ని అరసు తిండివనం నుంచి 734 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరొకరు జోతిమణి. 33,063 ఓట్ల తేడాతో కట్టుమన్నార్ కోవిల్ నుంచి గెలుపొందారు. ఇప్పుడు వీళ్లు ఇచ్చే మద్దతు పైనే టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంది.












Click it and Unblock the Notifications