సీఎం విజయ్పై నోరు పారేసుకున్న బీజేపీ నేత.. అసెంబ్లీలో ‘కుట్టి కథ’ రగడ..
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అయితే ఈసారి నేతల మధ్య మాటల తూటాలు సంస్కారవంతమైన సరిహద్దులను దాటేశాయి. తమిళగ వెట్రి కజగం అధినేత, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారాయి. ప్రజా సమస్యలపై సాగాల్సిన రాజకీయ సమరం కాస్తా.. కుటుంబాలను, తల్లులను లాగే స్థాయికి దిగజారడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఈ వివాదానికి బీజం ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో పడింది. గత ఎన్నికల డీఎంకే ఓటమి అనంతరం.. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ఒక 'కుట్టి కథ' చెప్తూ డీఎంకే అధినేతను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొడుకు తన తండ్రి ఎక్కడ అని వెతుక్కునే సన్నివేశాన్ని హాస్యస్పదంగా ప్రస్తావిస్తూ ప్రత్యర్థులపై బాణాలు విసిరారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై డీఎంపే వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే తాను చట్టసభలో లేకపోయినా ప్రజల గుండెల్లో ఉన్నానంటూ అప్పట్లో మాజీ సీఎం కూడా కౌంటర్ ఇచ్చారు.

హద్దులు దాటిన 'తల్లి' వ్యాఖ్యలు.. బీజేపీ కేడర్ దిగ్భ్రాంతి!
అసెంబ్లీలో విజయ్ చేసిన ఆ వ్యాఖ్యలను మనసులో ఉంచుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో నోరు పారేసుకున్నారు. "అసెంబ్లీలోకి వచ్చి 'తండ్రి ఎక్కడ?' అని వెతికితే దొరకరు.. ఆ సమాధానం కావాలంటే ఇంటికి వెళ్లి కన్న తల్లిని అడగాలి" అంటూ అత్యంత నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా ఈ మాటలు విన్న రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. రాజకీయంలో విమర్శలు సహజమే అయినా, నేరుగా కన్నతల్లి ప్రస్తావన తీసుకురావడం ఏమిటని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సొంత పార్టీ నుంచే నిరసన సెగ.. అన్నామలై ఘాటు స్పందన!
నైనార్ నాగేంద్రన్ చేసిన ఈ దిగజారుడు వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలే కాదు, సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై కూడా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం, విధానపరమైన విభేదాలు ఉండటం సహజమేనని.. ಆದರೆ ఒక నేత కన్నతల్లిని, కుటుంబాన్ని రాజకీయంలోకి లాగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కచ్చితంగా చెప్పారు. ఇది మూడో తరగతి రాజకీయమని, భావి తరాలకు మనం ఇచ్చే సందేశం ఇది కాకూడదని అన్నామలై స్పష్టం చేయడం విశేషం.
నాగరికత లేని రాజకీయం అంటూ టీవీకే, డీఎంకే ధ్వజం!
మరోవైపు రాష్ట్ర మంత్రి ఏ. రాజమోహన్ కూడా బీజేపీ అధ్యక్షుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేంద్రన్ మాట్లాడిన భాష నాగరికమైనది కాదని, తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. విజయ్ ఎప్పుడూ తన కార్యకర్తలకు రాజకీయ సంస్కారాన్ని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలనే నేర్పిస్తారని చెప్పారు. నైనార్ నాగేంద్రన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని టీవీకే నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంతో తమిళనాడులో బీజేపీ, టీవీకే మధ్య రాజకీయ యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది.














Click it and Unblock the Notifications