మహిళ ఎంపీలతో శశిథరూర్ సెల్పీ.. సోషల్ మీడియాలో పోస్ట్, నెటిజన్ల ట్రోల్.. సారీ
శశిథరూర్.. మంచి పార్లమెంటరీయన్.. ఇంగ్లీష్పై పట్టున్న మేధావి.. కానీ ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం.. భార్య సునంద పుష్కర్ మరణం మచ్చగానే మిగిలిపోయాయి. అయితే ఆయన ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఇవాళ పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇవాళ తోటి మహిళా ఎంపీలతో ఫోటో దిగి.. పోస్ట్ చేశారు. దానిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అందచందాలు, ఆకర్షణీయత గురించి సగటు మగవాడిలా కామెంట్ చేయడం ఏంటీ అంటూ ఫైర్ అవుతున్నారు. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు శశిథరూర్ సారీ చెప్పారు. ఉదయం శశి థరూర్ ట్విటర్లో మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఓ ఫోటో షేర్ చేశారు. లోక్సభ పని చేయడానికి ఆకర్షనీయమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. తన తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను అనే క్యాప్షన్తో థరూర్ షేర్ చేశారు.
మహిళలపట్ల థరూర్ వివక్షతో వ్యవహరించారని నెటిజన్లు ఆరోపించారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి.. తోటి మహిళా ఎంపీల గురించి ఇలా కామెంట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా.. ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా.. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరి ఇదేంటి సార్ అని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. సరదాకు చేసిన పని కాస్త ఇలా రివర్స్ కావడంతో శశి థరూర్ వెనక్కి తగ్గారు.
సారీ చెప్తూ మరో ట్వీట్ చేశారు. ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు ఈ ఫోటోను ట్వీట్ చేయమని కోరగా చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ట్వీట్లో శశి థరూర్ తెలిపారు. సెల్ఫీలో సుప్రియా సూలే,అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, తమిళచి తంగపాండ్యన్, మిమి చక్రబర్తి, నుస్రత్ జహాన్, జోతిమాన్ సెన్నిమలై ఉన్నారు.