పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే: గుజరాత్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యమే!
Recommended Video

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప ఆధిక్యంతో తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే అంచనా. కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడినప్పటికీ ఆ పార్టీకి అధికారాన్ని చేజిక్కించుకునేంత మెజార్టీ రాదని ఈ సర్వే వెల్లడిస్తోంది.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకూ నిర్వహించిన పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే సర్వేలో బీజేపీకి 44.8 శాతం ఓట్లు పోలవుతాయని, కాంగ్రెస్కు 43.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఇతరులకు 12 శాతం ఓట్లు రావచ్చని సర్వే చెబుతోంది.

సీట్ల సంఖ్య అంచనా కష్టమే...
ఓటింగ్ శాతం బాగా తక్కువగా ఉండడంతో ఆయా పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్యను ఈ సర్వే అంచనా వేయలేకపోయినా, కాంగ్రెస్తో పోలిస్తే.. బీజేపీకి కేవలం 1.6 శాతం ఓట్లే అధికంగా వస్తాయని ఈ పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే భావిస్తోంది. గుజరాత్లో బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు 45.9 శాతం మంది సానుకూలంగా స్పందించారు. అలాగే ఈసారి కాంగ్రెస్కు అవకాశం ఇస్తామని 44.1 శాతం మంది తెలిపారు. ఇక్కడా రెండు పార్టీలకు ఓట్ల తేడా కేవలం 1.7 శాతమే.

బీజేపీకి ఇవే ప్రతికూలం...
గుజరాత్లో 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. వరుసగా మూడు పర్యాయాలు ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఇన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగడం కూడా ఆ పార్టీకి ప్రతికూల అంశంగా మారిందని చెబుతున్నారు. ఇంకా పటేళ్ల ఉద్యమం, నోట్లరద్దు ప్రభావం, జీఎస్టీ, దళితులపై దాడులు కూడా బీజేపీకి ప్రతికూలంగా మారతాయని భావిస్తున్నారు. పత్తి, వేరుసెనగకు మద్దతు ధర లభించకపోవడం కూడా బీజేపీ పట్ల రైతుల్లో వ్యతిరేకతను పెంచింది.

కాంగ్రెస్ ప్రతికూల అంశాలివీ...
గుజరాత్లో కాంగ్రెస్కు.. సంస్థాగత నిర్మాణం పటిష్టంగా లేకపోవడం, బలమైన నాయకత్వం కొరవడడం ప్రతికూల అంశాలు. ఆ పార్టీ కేవలం రాహుల్ గాంధీ ఛరిష్మాపైనే ఆధారపడడం కూడా మరో ప్రతికూల అంశంగా మారిందని చెబుతున్నారు. అంతేకాదు, గుజరాత్లో ప్రచారం విషయంలో గ్రామీణ ప్రాంతాలపై చూపించిన శ్రద్ధను కాంగ్రెస్ పట్టణ ప్రాంతాలపై చూపించలేదు. ఇది ఆ పార్టీకి మరో మైనస్గా చెప్పుకోవచ్చు.

సీఎంపై వ్యతిరేకత కూడా...
గుజరాత్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యత రావడానికి మరో ప్రధాన కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పనితీరు కూడా. ఆయన పనితీరుపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. సీఎం విజయ్ రూపానీ పనితీరు బాగలేదని 59.2 శాతం మంది అభిప్రాయపడగా, పర్వాలేదని 22 శాతం మంది, బాగుందని కేవలం 18.6 శాతం మంది మాత్రమే చెప్పారు.

సీఎంగా ఎవరు కావాలంటే...
గుజరాత్ తదుపరి సీఎంగా ఎవరివైపు మొగ్గుచూపుతారు? అన్న ప్రశ్నకు 22.9 శాతం మంది విజయ్ రూపానీకి సానుకూలంగా ఓటేయగా, కాంగ్రెస్కు చెందిన భరత్ సింగ్ సోలంకి వైపు 18.6 శాతం మంది మొగ్గు చూపారు. ఇక మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్కు కేవలం 6.5 శాతం మంది మాత్రమే తమ ఓటు వేశారు.












Click it and Unblock the Notifications