బెంగళూరులో మీరైనా ఉండాలి లేదా రౌడీలైనా ఉండాలి, అవమానం, రామలింగా రెడ్డి వార్నింగ్ !
బెంగళూరు నగరంలో మీరైనా ఉండాలి లేదా రౌడీలైనా ఉండాలి, ఏం చేస్తారో మీరే తేల్చుకోండి అంటూ కర్ణాటక హోం శాఖా మంత్రి రామలింగా రెడ్డి పోలీసులను హెచ్చరించారు.
బెంగళూరు: బెంగళూరు నగరంలో మీరైనా ఉండాలి లేదా రౌడీలైనా ఉండాలి, ఏం చేస్తారో మీరే తేల్చుకోండి అంటూ కర్ణాటక హోం శాఖా మంత్రి రామలింగా రెడ్డి పోలీసులను హెచ్చరించారు. పోలీసులు, రౌడీలు ఒకే చోట ఉంటే పోలీసులకే అవమానం అంటూ మంత్రి రామలింగా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
శనివారం బెంగళూరులోని ఎఫ్ కేసీసీఐలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోం శాఖా మంత్రి రామలింగా రెడ్డి మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రత్యేక చట్టాలు అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేస్తే శాంతి భద్రతలు అదుపులోనే ఉంటాయని పోలీసులకు గుర్తు చేశారు.
మీకు చేతనైతే రౌడీలు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడండి, లేదా వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించండి, లేదా మీరైన వెళ్లిపోండి అని మంత్రి రామలింగా రెడ్డి పోలీసులను హెచ్చరించారు. పాఠశాలలు, కాలేజ్ ల దగ్గర భద్రత పెంచండి, ప్రతి ప్రిన్సిపాల్ తో స్థానిక ఇన్స్ పెక్టర్ టచ్ లో ఉండాలి, గొడవ జరిగిన వెంటనే విద్యాసంస్థల యాజమాన్యం సమాచారం ఇవ్వాలని సూచించాలని పోలీసులకు చెప్పారు.
బెంగళూరులో పాల విక్రయాలు ప్రారంభం కాకముందే వైన్ షాప్ లో మద్యం వ్యాపారం మొదలౌతుందని, మీరు ఏం చేస్తున్నారు అంటూ పోలీసులను సూటిగా ప్రశ్నించారు. బెంగళూరు నగరంలో కాలేజ్ ల సమీపంలో ఏర్పాటు చేసిన స్కిల్ గేమ్, వీడియో గేమ్, పేకాట, మట్కా, హుక్కా బార్ లను వెంటనే మూసి వెయ్యాలని మంత్రి రామలింగా రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులో ఇక ముందు రౌడీఇజం జరిగినట్లు తనకు తేలిస్తే స్థానిక పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి రామలింగా రెడ్డి హెచ్చరించారు.