చైనా పటంలో అరుణాచల్, అంతమాత్రాన కాదని భారత్
న్యూఢిల్లీ: చైనా పటంలో అరుణాచల్ ప్రదేశ్ను చేర్చడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. పటాల్లో చేర్చినంత మాత్రాన భూమిమీద ఉన్న వాస్తవాన్ని మార్చలేరని, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేసింది. చైనా దేశ పటాల్లో అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంగా చూపించిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం శనివారం ఘాటుగానే స్పందించింది.
అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమేనని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని వివాదాస్పద ప్రాంతాలు, దక్షిణ చైనా సముద్రం తమవిగా చూపించే చైనా మ్యాప్లపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిని విలేఖరులు ప్రశ్నించగా... కేవలం మ్యాప్లలో గీతల్లో చూపించినంత మాత్రాన వాస్తవ పరిస్థితి మారబోదన్నారు.
అరుణాచల్ భారత దేశంలో అంతర్భాగమనే విషయాన్ని అత్యున్నత స్థాయి నాయకులతో సహా చైనా ప్రభుత్వానికి ఎన్నోసార్లు స్పష్టంగా తెలియజేశామని చెప్పారు. పంచశీల 60 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఉపరాష్టప్రతి హమిద్ అన్సారీ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం చైనా నాయకుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశముందని కూడా ఆయన చెప్పారు.
లడఖ్ ప్రాంతంలో చైనా సైన్యాలు తాజాగా చొరబాట్లకు పాల్పడినట్లు వచ్చిన వార్తల గురించి అడగ్గా.. ఆ సంఘటనను ధ్రువీకరించడం లేదా ఖండించడం చేయలేదు. అయితే మన సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులు మన భూభాగాలను భద్రంగా ఉంచగల సామర్థ్యం కలిగి ఉన్నారన్నారు.