రియల్ హీరో: 10కిలోల బాంబు భుజాన పెట్టుకొని కి.మీ పరుగెత్తిన పోలీస్
అతడు నిజమైన హీరో. ఎందుకంటే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బాంబును భుజన పెట్టుకుని పరుగెత్తాడు.
భోపాల్: అతడు నిజమైన హీరో. ఎందుకంటే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బాంబును భుజన పెట్టుకుని పరుగెత్తాడు. కిలోమీటర్ వరకు పరుగెత్తి దూరంగా బాంబును పడేశాడు. దీంతో పెను ప్రమాదం నుంచి పాఠశాల పిల్లలందరూ బయటపడ్డారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లో వెళితే.. సాగర్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబు కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుల్ అభిషేక్ పటేల్కు పాఠశాలలో పెట్టిన 12 అంగుళాల బాంబు కంటపడింది.
అయితే, అప్పటికీ బాంబు నిర్వీర్య బృందం పాఠశాలకు రాలేదు. దీంతో పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు పటేల్ పది కేజీల బరువు ఉన్న బాంబును భుజాన పెట్టుకొని నిర్జన ప్రదేశంలో పారేయడానికి పరిగెత్తాడు. ఆ సమయంలో పాఠశాలలో 400 మంది చిన్నారులు ఉన్నారు.
కిలోమీటరు దూరం పాటు ఆ బాంబును అలాగే పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. దూరంగా బాంబును పడేశారు. అదృష్టవశాత్తూ ఆ బాంబు పటేల్ చేతిలో ఉన్నప్పుడు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు పాఠశాలలో ఎవరు బాంబు పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి 400 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన పటేల్ను ఉన్నతాధికారులు అభినందించారు. ఆయన చూపించిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఐజీ రివార్డు ప్రకటించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా పటేల్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.