జామియా విద్యార్థులకు బుల్లెట్ గాయాలు..పోలీసులు చెబుతున్నదేమిటి..?
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్టంకు వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్థులు ఆదివారం నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు క్యాంపస్లోకి ప్రవేశించి విద్యార్థులపై దాడులు చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాము ఎలాంటి కాల్పులకు పాల్పడలేదని పోలీసులు చెబుతుండగా... విద్యార్థులు మాత్రం పోలీసులు కాల్పులకు పాల్పడ్డారని చెబుతున్నారు. అంతేకాదు విద్యార్థులను పరిశీలించిన డాక్టర్లు కూడా విద్యార్థులపై కాల్పులు జరిగాయని చెబుతున్నారు.
ఆందోళనల సందర్భంగా గాయపడిన విద్యార్థులు చికిత్స కోసం సఫ్ధార్ జంగ్ హాస్పిటల్కు రాగా ఇద్దరి విద్యార్థులపైకి తూటాలు దూసుకొచ్చినట్లు చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. దీంతో పోలీసులు చెబుతున్నది అవాస్తవం అని తేలిపోయింది. పోలీసుల కాల్పుల్లో అజాజ్ అనే విద్యార్థి గుండెల్లోకి తూటా వెళ్లినట్లు అతని తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు మాత్రం టియర్ గ్యాస్ ప్రయోగించడంతోనే గాయాలు అయ్యాయని చెబుతున్నారు. అయితే అజాజ్ పై కాల్పులు జరిగిన సమయంలో వీడియో కూడా బయటపడింది. పరిసర ప్రాంతాల్లో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించినట్లు ఎక్కడా కనిపించలేదు.
షోయబ్ ఖాన్ అనే 23 ఏళ్ల వ్యక్తి కూడా భాష్పవాయువు ప్రయోగంతోనే గాయపడ్డారని పోలీసులు బుకాయిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో మొహ్మద్ తమీన్ అనే మరో విద్యార్థి చికిత్స కోసం వెళ్లాడు. ఆ సమయంలో కూడా వీడియో తీశారు. తమీన్ తొడభాగంలో బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ వీడియోను మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోస్టు చేశారు. ఇక హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టులో తమీన్ శరీరంలోకి బుల్లెట్ లాంటిది ఒకటి వెళ్లిందని పొందుపర్చారు. ఇది తుపాకీతో కాల్చడం వల్లే జరిగిందని చెప్పారు. దాన్ని బయటకు తీసేసినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే తమీన్ మాత్రం పోలీసులు తనపై దగ్గర నుంచి కాల్పలు జరిపారని చెప్పాడు.