రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం.. అన్ని రంగాల్లో విఫలం: అమిత్ షా ధ్వజం
బెంగళూరు: శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ కర్ణాటక నేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
సోమవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, అవినీతికి పర్యాయపదంగా మారిందని దుయ్యబట్టారు. శాంతిభద్రతలు, అభివృద్ధి.. ఇలా ఏ రంగంలో చూసినా సిద్ధరామయ్య విఫలమయ్యారన్నారు.
అంతేకాదు, రాష్ట్రంలో అవినీతి కేసులు పెరిగిపోతున్నాయని.. అవినీతి, సిద్ధరామయ్య ప్రభుత్వం పర్యాయపదాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమని అమిత్ షా విమర్శించారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించడం సిద్ధరామయ్య ఏకపక్ష చర్యకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే నియోజకవర్గం ఇంకా వెనుకబడి ఉందని అమిత్షా పేర్కొన్నారు.