మగవాళ్లు ఆ అవమానం ఎందుకు భరించాలి?: కోర్టు కీలక వ్యాఖ్యలు
పురుషులు కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని ఢిల్లీలోని ఓ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచారం కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి నివేదిత అనిల్ శర్మ మాట్లాడుతూ..
న్యూఢిల్లీ: పురుషులు కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని ఢిల్లీలోని ఓ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచారం కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి నివేదిత అనిల్ శర్మ మాట్లాడుతూ.. మహిళల గౌరవం, ప్రతిష్ట కోసం పోరాటాలు చేసేవాళ్లు.. మగవారి విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

తాజాగా తీర్పు..
ఇప్పుడు మగవాళ్ల కోసం కూడా పోరాడాల్సిన తరుణం వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 1997, సెప్టెంబర్ 18న(అంటే 20ఏళ్ల క్రితం) ఇంట్లో ఒంటరిగా ఉన్న తనను అపహరించి, అత్యాచారం చేశాడంటూ ఓ యువకుడిపై ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.

తాజాగా తీర్పులో నిర్దోషిగా..
అయితే, అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చివరికి తేలింది. ఆమెపై లైంగిక దాడి జరగలేదని మెడికల్ నివేదికలు కూడా తేల్చాయి. దీంతో న్యాయస్థానం తాజాగా అతడ్ని నిర్దోషిగా తేల్చింది.

మగవారికి చాలా అన్యాయం..
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. అత్యాచార కేసుల్లో తప్పుడు ఆరోపణలు మగవారికీ చాలా అన్యాయం చేస్తున్నాయని అన్నారు. తమకు రక్షణగా ఉన్న చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
కేసులో నిందితుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని బయటకు వచ్చినప్పటికీ.. సమాజం దృష్టిలో అతను అత్యాచార ఆరోపితుడిగా మిగిలిపోతాడని అన్నారు.

జీవితాంతం అవమానం భరించాలా?
జీవితకాలం అతను ఈ అవమానాన్ని భరించాల్సి ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అంతేగాక, అత్యాచారం జరిగిందని తెలియగానే బాధితురాలికి అండగా నిలిచే ప్రజలు, మహిళా సంఘాలు.. ముద్దాయి నిర్దోషి అని తేలిన తర్వాత అతనికి ఎందుకు మద్దతుగా నిలబడటం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. మగవారి గౌరవ, మర్యాదలను కాపాడడానికి మహిళా సంఘాలు కూడా ముందుకు రావాలని సూచించారు.












Click it and Unblock the Notifications