అయోధ్యలో భక్తుల రద్దీతో కీలకనిర్ణయం; రామయ్యను నిన్న ఎంతమంది దర్శించుకున్నారంటే!!
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవటం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు బారులు తీరుతున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న క్రమంలో అయోధ్య వీధులన్నీ శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. నిన్న తెల్లవారు జామున మూడు గంటల నుండే సామాన్య భక్తులు అయోధ్య రామయ్య దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
అయితే అయోధ్యలో భక్తులకు రామయ్య దర్శనం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుండి ఏడు గంటల వరకు అనుమతి ఇస్తారు. అయినప్పటికీ రామయ్య దర్శనం కోసం తెల్లవారు జాము నుండే భక్తులు ఎదురు చూశారు. ఓ దశలో భక్తుల తాకిడి పెరిగి అయోధ్యలో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.

భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అయోధ్యలో ఎనిమిది వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న అయోధ్య బాలరాముడిని 5 లక్షల మంది వరకు దర్శనం చేసుకున్నారని సమాచారం. అయోధ్య రామ మందిరానికి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్న క్రమంలో అక్కడ పరిస్థితి గందరగోళంగా తయారైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేశారు.
అంచనా వేసిన దానికంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో రావటంతో నగరంలోకి వచ్చే వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయోధ్యలోనికి వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ నిలిపి వేస్తున్నారు. భక్తులతో అయోధ్య నిండిపోవటంతో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ లక్నో నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిస్థితిని అంచనా వెయ్యాలని అధికారులను ఆదేశించారు.
అయోధ్యలో రద్దీ దృష్ట్యా భద్రత ప్రమాదంలోకి వెళ్ళే చాన్స్ ఉండటంతో యాత్రికుల రాకను కట్టడి చెయ్యాలని భావించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోకి వచ్చే వారిని కట్టడి చెయ్యాలని భద్రతా సిబ్బందికి సూచించారు. దర్శనానికి తొందర పడవద్దని భక్తులకు అక్కడ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు రెండు వారాల తర్వాతనే అయోధ్యకు రావటానికి ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications