Crypto Currency:2018లో జారీ చేసిన ఆర్డర్ రద్దు అయ్యింది: బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్
2018లో తాము ఇచ్చిన ఆర్డర్ను చూపిస్తూ బ్యాంకులు లేదా ఇతర బ్యాకింగ్ వ్యవస్థలు క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ వినియోగదారులపై పై చర్యలు తీసుకోరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. 2020లో సుప్రీంకోర్టు తాము జారీ చేసిన ఆర్డర్ను కొట్టివేసిందని గుర్తుచేసింది. అంతేకాదు ఈ ఆర్డర్ను కొట్టివేసిన తేదీ నుంచే క్రిప్టోకరెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. దీంతో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు భారీ ఊరట లభించినట్లయ్యింది.
క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన వారిపై బ్యాంకులు ఇతర బ్యాంకింగ్ వ్యవస్థలు చర్యలు తీసుకుంటున్నాయనే విషయం మీడియా కథనాల ద్వారా తమ దృష్టికి వచ్చిందని చెప్పిన ఆర్బీఐ... ఇలా చర్యలు తీసుకునేందుకు తాము 2018లో జారీ చేసిన సర్క్యులర్ను చూపిస్తున్నాయని పేర్కొంది. అయితే ఈ సర్క్యులర్ను సుప్రీంకోర్టు 2020లో కొట్టేసిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే కేవైసీ, యాంటీ మనీ లాండరింగ్, ఉగ్రవాదంకు నిధులు సమీకరించడం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టాలు ఉల్లంఘించకుండా అన్ని డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయా బ్యాంకులను ఆదేశించింది.అలాగే, విదేశీ చెల్లింపుల కోసం బ్యాంకులు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ తెలిపింది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం దేశంలోని ప్రధాన బ్యాంకుల సేవల వినియోగంపై కస్టమర్లను ఆయా బ్యాంకులు హెచ్చరించిన కొద్దిసేపటికే... వర్చువల్ కరెన్సీలలో (వీసీ) లావాదేవీల కోసం కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అనే సర్క్యులర్ను ఆర్బీఐ విడుదల చేసింది.
ఇక దీనిపై పలువురు ఆర్థిక నిపుణులు స్పందించారు. ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్లో క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్పై బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు విధించరాదన్న అంశం స్పష్టం అవుతోందని వజీర్ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి అన్నారు. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పై 2018లో ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ను గతేడాది మార్చి 4వ తేదీన సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నాటినుంచే ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్కు ఎలాంటి విలువ ఉండదని సెంట్రల్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది.
క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేసే డిజిటల్ మనీ. ముఖ్యంగా బిట్కాయిన్, ఇథెరియం వంటివి బాగా పాపులర్ అయ్యాయి. అయితే వ్యవస్థలో కొన్ని వేల సంఖ్యలో క్రిప్టోకరెన్సీలు చెలామణిలో ఉన్నాయి. అయితే ఆర్బీఐ లేదా ప్రభుత్వాలు దీనిపై ఒక స్పష్టమైన అభిప్రాయానికి రానప్పటికీ, ఇప్పటికే చాలామంది భారతీయులు ఈ క్రిప్టో మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. క్రిప్టో ఎక్స్ఛేంజెస్ సమాచారం ప్రకారం ఇప్పటికే 1.5 కోట్ల మంది భారతీయులు దాదాపుగా రూ.15వేల కోట్లు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారు.
ఇక క్రిప్టో కరెన్సీలో వాణిజ్యం నెరపరాదని ఆర్బీఐ ఆలోచన ఉండగా.. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా లేదు. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత లేదు. క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ నిర్వహించకుండా చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. క్రిప్టో కరెన్సీ ద్వారా జరిపే లావాదేవీలు చట్టబద్దం కాదని ఈ బిల్లులో ప్రతిపాదించనున్నారు. అయితే దీన్ని పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.