జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో వాయుగుండం వేగంగా దూసుకొస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరాన, ఒడిశాలోని గోపాలపూర్కు దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరాన ఇది కేంద్రీకృతమైంది.
ఇది తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది.
ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఒకటి, రెండుచోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది.
వాతావరణ శాఖ అలర్ట్
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా పయనించి మరో 12 గంటల్లో ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రాంతాల్లోని యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉత్తర, కోస్తాంధ్ర జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్లు, శనివారం ఉదయం 70-90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాల గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు.
పాఠశాలలకు సెలవులు, పలు రైళ్లు రద్దు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ సిబ్బందికి జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దు చేశారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ నెల 3 నుంచి 5 వరకు విశాఖపట్నంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున ప్రకటించారు. ఇవాళ (శుక్రవారం) బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
సీఎం సమీక్ష... నేవీ సిద్ధం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుపాను సన్నద్ధతపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.
తుపాను అప్రమత్తతపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు చర్చించారు.
బోట్లు, రంపాలు, టెలికాం పరికరాలతో ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 29 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మరో 33 బృందాలను సన్నద్ధం చేశారు. కోస్ట్గార్డు, నేవీకి చెందిన హెలికాప్టర్లు, నౌకలను సిద్ధం చేశారు.
తీరం ఎక్కడ దాటుతుంది?
ఒడిశా, శ్రీకాకుళం సరిహద్దు తీర ప్రాంతాల సమీపంలో తుపాను తీరం దాటుతుందని వాతావరణశాఖ ప్రస్తుతం అంచనా వేస్తోంది.
అయితే, తుపాను కచ్చితంగా ఎక్కడ తీరం దాటవచ్చన్న అంశంలో స్పష్టత లేదు. వాతావరణ పరిస్థితులను బట్టి వాయుగుండం మలుపు తిరిగి ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు.
నాలుగో తేదీ రాత్రికి ఉత్తరాంధ్రలో తీరం దాటే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని వాతావరణశాఖ నిపుణులు చెప్తున్నారు.
https://twitter.com/ANI/status/1466355716612968454
ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్
జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశాలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
డిసెంబర్ 4న తీర ప్రాంతాల్లో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ సైంటిస్ట్ ఉమాశంకర్ దాస్ చెప్పారు. జనం ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమీక్షించారు.
''రానున్న మూడు రోజుల్లో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమాచారం అందించాం. సహాయక చర్యల ఏర్పాట్లను హోంశాఖ కార్యదర్శి వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో 29 బృందాలను మోహరించాం'' అని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) డీజీ అతుల్ కర్వాల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- క్వాంటం కంప్యూటర్: ఈ టెక్నాలజీలో అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలతో ఇండియా ఎందుకు పోటీ పడుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు
- 'ఒకడు ప్రకృతి.. మరొకడు ప్రళయం’
- 'బీబీసీ న్యూస్ తెలుగు’కు ఆదరణ.. 52 శాతం పెరిగిన ఆడియన్స్
- 'ప్రేమ, అభిమానం లేని భర్తతో సెక్స్ ఎలా సాధ్యం? నాకు ఆయనతో కలవాలనే కోరిక ఎలా కలుగుతుంది’
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆ దేశాన్ని అప్పుల్లో ముంచిందా
- అత్యాచారం, హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది, మరణ శిక్ష కావాలని నిందితుడు కోరాడు.. హైకోర్టు నిర్దోషిగా ఎలా విడుదల చేసింది?
- కరోనావైరస్: జపాన్లో ఒక్కసారిగా తగ్గిన కోవిడ్ కేసులు - డెల్టా వేరియంట్ అంతమైనట్లేనా?
- దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు
- కోవిడ్తో యూరప్లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న డబ్ల్యూహెచ్ఓ
- చరిత్ర: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)