కన్న కూతురిపై మిత్రుడితో కలిసి గ్యాంగ్ రేప్
తమ విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారని కశిమిరా పోలీస్ ఇన్స్పెక్టర్ ఫతేహ్సింహ్ పాటిల్ తెలిపారు. నిందితులు పోలీసులకు చెప్పిన కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లాలోని కోమల్ పూర్ గ్రామానికి చెందిన యువతి, 19ఏళ్ల తన ప్రియుడుతో కలిసి నాలుగు నెలల క్రితం అక్కడ్నుంచి పారిపోయి ముంబై చేరుకుంది.
నగరానికి చేరుకున్న వారు ఓ ఆలయంలో వివాహం చేసుకుని భయందర్లో నివాసం ఉంటున్నారు. కాగా యువతి తండ్రి నగరంలోని కశిమిరా సమీపంలోని దుచ్కల్పాడలో నివాసముంటున్న స్నేహితుని సహకారంతో తన కూతురు చిరునామాను తెలుసుకున్నారు. యువతి తండ్రి, అతని స్నేహితుడు కలిసి తన కూతురు నివాసానికి చేరుకుని తన కూతురును బలవంతంగా లాక్కెళ్లారు. ఆ సమయంలో తన కూతురు ప్రియుడు అక్కడ్నుంచి పారిపోయాడని నిందితులు తెలిపారు.
తన స్నేహితుని ఇంటికి తీసుకెళ్లిన తండ్రి ఆ యువతిని ఇంటికి రావాలని కోరాడు. ఇందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కశిమిర సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆ యువతిపై తన స్నేహితునితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని హత్య చేసి పొదల్లో పడేశారు. ఆ తర్వాత మద్యం సేవించిన యువతి తండ్రి ఓ హోటల్లో పనిచేసే కార్మికుడికి ఈ విషయాన్ని చెప్పాడు. ఆ కార్మికుడు హోటల్ యజమానికి చెప్పడంతో అతను స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై ఐపిసి 302 (హత్య), 376(సామూహిక అత్యాచారం), 201, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా తన ప్రియుడితో పారిపోయి తమ కుటుంబ పరువును మంటకలిపిన తన కూతురుకు గుణపాఠం చెప్పేందుకే ఇలా చేశానని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న యువతి ప్రియుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.