ఆటో డ్రైవర్ కూతురు.. జడ్జిగా ఎంపికైంది! పైగా స్టేట్ టాపర్ కూడా...
డెహ్రాడూన్: ఓ ఆటో డ్రైవర్ కూతురు ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది. జడ్జి అయి తన పట్టుదలను చాటుకుంది. ఇటీవల వెల్లడించిన ఉత్తరఖండ్ ప్రొవిజనల్ సివిల్ సర్వీసెస్ (జ్యూడిషియల్) - 2016 ఫలితాల్లో పూనమ్ తోడి స్టేట్ టాపర్గా నిలిచారు.
గతంలో రెండుసార్లు ఈ పరీక్ష రాసినప్పటికీ.. పూనమ్ ఇంటర్వ్యూ రౌండ్ను కూడా అధిగమించలేకపోయారు. రెండుసార్లు ఓటమి నిరాశపరిచినప్పటికీ ఆమె ఏ మాత్రం కుంగిపోలేదు. మూడోసారి మరింతగా శ్రమించి ఏకంగా స్టేట్ టాపర్గా నిలిచారు.
ఆమె తండ్రి అశోక్ తోడి ఆటో నడుపుతూ రోజు అతి కష్టం మీద రూ. 500 వరకు సంపాదిస్తాడు. కానీ అమ్మాయి, అబ్బాయి అనే తారతమ్యం చూపకుండా ఆడపిల్లల్ని కూడా చదివించాడు. పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో.. సొంత అవసరాలను సైతం ఆయన పక్కన పెట్టేవారు.
Uttarakhand: Poonam Todi, daughter of an auto driver residing in Dharampur's Nehru Colony in Dehradun, tops Provincial Civil Services (PCS-judicial) examinations 2016 result of which were declared today; her mother Lata Todi says 'I wish all mothers get daughters like her'. pic.twitter.com/6pQfa4Qf8p
— ANI (@ANI) March 1, 2018
పూనమ్ తండ్రి గతంలో తెహ్రీలో ఓ చిన్న దుకాణం నడిపేవారు. కానీ ఆదాయం సరిపోకపోవడంతో డెహ్రాడూన్ వలస వచ్చారు. అక్కడా ఓ దుకాణం ప్రారంభించినప్పటికీ.. లాభసాటిగా లేకపోవడంతో ఆటో నడపడం మొదపెట్టాడు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.
తండ్రి ఆదాయం అంతంతమాత్రమే అయినా... కుటుంబ పోషణ భారంగా మారినా.. ఏనాడూ ఉద్యోగంలో చేరమని తల్లిదండ్రులు తనను బలవంతం చేయలేదని పూనమ్ తోడి తెలిపింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎంకామ్, న్యాయ విద్యను పూర్తి చేశానని ఆమె పేర్కొంది.
ఇక కూతురు సాధించిన విజయం పట్ల ఆమె తండ్రి అశోక్ ఎంతగానో మురిసిపోతున్నాడు. పూనమ్కు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు అక్కకు పెళ్లి కాగా, అన్నయ్య ప్రయివేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తమ్ముడు చదువుకుంటున్నాడు.