మాఫియాను తుడిచి పెట్టేస్తోన్న ముంబై పోలీస్: దావూద్ ఇబ్రహీం సోదరుడి కుమారుడు అరెస్ట్!
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా అంటే ఠక్కున గుర్తుకొచ్చే నగరం దేశ ఆర్థిక రాజధాని ముంబై. ముంబైని కేంద్రంగా చేసుకుని మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్న వారు చాలామందే ఉన్నారు. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, ఇక్బాల్ కస్కర్, హాజీ మస్తాన్, వరదరాజ మొదలియార్ వంటి మాఫియా డాన్లు ముంబై చీకటి సామ్రాజ్యాన్ని ఏలారు. ప్రస్తుతం మాఫియాను దాదాపు అణచివేశారు అక్కడి పోలీసులు.
వీడియో: సొంతకారులో దర్జాగా! ఉగ్రవాదికి పాక్ అధికారుల వీఐపీ ట్రీట్మెంట్!
మాఫియాను నిర్మూలించే క్రమంలో - మరో బ్రేక్త్రూ సాధించారు. దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు రిజ్వాన్ కస్కర్ను పోలీసులు అరెస్టు చేశారు. దేశం విడిచి పారిపోతున్న అతణ్ని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. థానే జైలుకు తరలించారు.
ఛోటా షకీల్ దగ్గరి బంధువులు, అతని ప్రధాన అనుచరులను అరెస్టు చేసిన 48 గంటల వ్యవధిలోనే ముంబై పోలీసులు రిజ్వాన్ కస్కర్ను అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తామని కొంతమంది బిగ్ షాట్లను బెదిరించి, లక్షల రూపాయలను అక్రమంగా వసూలు చేసిన కేసుల్లో రిజ్వాన్ కస్కర్ అరెస్టు అయ్యాడు. అతనిపై ముంబైలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి.
తన చుట్టు ఉచ్చు బిగించుకుంటుండటంతో అప్రమత్తమైన రిజ్వాన్.. బుధవారం రాత్రి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించాడు. మారువేషంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. థానే జైలుకు తరలించారు. రెండు కిందటే ఛోటా షకీల్ అనుచరులను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. ఛోటా షకీల్ కుడిభుజంగా చెప్పుకొనే అఫ్రోజ్ వడారియాను వలపన్ని మరీ పట్టుకున్నారు. అతణ్ని కూడా ముంబై విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు.