విదేశీ మహిళ అనుమానాస్పద మృతి: అత్యాచారం చేసి హత్య?, డిఎన్ఏ పరీక్షలు
తిరువనంతపురం:కేరళ రాష్ట్రంలోని కోవలంలో అదృశ్యమైన లాత్వియాకు చెందిన మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డిప్రెషన్కు గురైన బాధితురాలు చికిత్స కోసం లాత్వియా నుండి ఇండియాకు తిరిగొచ్చి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది.
కేరళ రాష్ట్రంలోని కోవలంలోని ఓ ఆశ్రమంలో చికిత్స కోసం లాత్వియా నుండి భర్త, సోదరితో కలిసి వచ్చిన విదేశీ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించింది. మృతురాలి మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో అడవిలో లభ్యమైంది.
బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్చి 14వ తేదిన మృతురాలు అదృశ్యమైంది. కానీ, ఏప్రిల్ 27వ తేది రాత్రి అదృశ్యమైన మహిళ మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.
చికిత్స కోసం వచ్చి హత్య
తీవ్రమైన డిప్రెషన్కు గురైన లాత్వియా దేశస్థురాలు లిగా స్క్రోమెన్ ఆమె భర్త ఆండ్రూస్, సోదరి ఇల్లాతో కలిసి లిగా ఇండియాకు వచ్చింది. చికిత్స కోసం కేరళ రాష్ట్రంలోని కోవలంలోని ఆయుర్వేద వైద్యాలయంలో చేరారు. అయితే చికిత్స కోసం వెళ్ళిన ఆమె ఈ ఏడాది మార్చి 14వ తేదిన అదృశ్యమయ్యారు. అప్పటి నుండి ఆమె ఆచూకీ లభ్యం కాలేదు కానీ, తిరువల్లూరులోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. మృతురాలు లిగాకు ఆమె సోదరి గుర్తించారు.
లిగా ఎలా చనిపోయింది
లాత్వియా దేశస్తురాలు లిగా ఎలా చనిపోయిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డిప్రెషన్కు గురైన లిగా ఆయుర్వేద చికిత్సాలయంలో ఆమె చికిత్స పొందుతోంది. అయితే చికిత్స కోసం వెళ్ళిన ఆమె అదృశ్యమై శవంగా తేలింది. మృతురాలిని కొందరు అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళారని వారి వద్ద మత్తు మందులు కూడ ఉన్నాయని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈ దిశగా దర్యాప్తును మొదలు పెట్టారు.ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారా అనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
మృుతురాలి శరీరంగా గాయాలు
లాత్వియా దేశానికి చెందిన లిగా మృతదేహంపై గాయాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. లిగా కాలిపై లోతైన గాయాలున్నాయి. అంతేకాదు ఆమె గొంతు నులిమినట్టుగా కన్పిస్తోందని పోలీసులు చెబుతున్నారు.హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డిఎన్ఏ పరీక్షలు
ఈ ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సుమారు ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలంలో లభించిన వెంట్రుకలతో పాటు ఇతర ఆధారాలను డిఎన్ఏ పరీక్షల కోసం పోలీసులు పంపారు.ఈ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకొంటామని పోలీసులు ప్రకటించారు.