ఏం డ్రామాలాడుతున్నారా, అపోలో-ఎయిమ్స్ నివేదికలకు పొంతనేలేదు: దీపా
జయలలిత డీహైడ్రేషన్, జ్వరంతో ఆసుపత్రిలో చేరారని, ఆమె కోలుకుంటున్నారని, టీవీ చూస్తున్నారని అప్పట్లో అపోలో ఆసుపత్రి నివేదిక ఇచ్చిందని, ఇప్పుడు జయ శ్వాసకోస ఇబ్బందితో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారని .
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స వివరాలు ప్రభుత్వం విడుదల చెయ్యడంతో ఆమె మేనకోడలు దీపా జయకుమార్ మండిపడ్డారు. మా అత్త ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారా, ఇష్టం వచ్చినట్లు వైద్య నివేదికలు ఇస్తారా ? అంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.
మంగళవారం జయలలిత మేనకోడలు దీపా ఓ ప్రకటన విడుదల చేశారు. జయలలితకు 75 రోజులు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి పొంతనలేని నివేదికలు ఇస్తున్నదని ఆరోపించారు. గతంలో అపోలో ఆసుపత్రి జయలలితకు ఇచ్చిన చికిత్స వివరాలు, సోమవారం ఇచ్చిన నివేదికలోని వివరాలకు పొంతనలేదని దీపా ఆరోపించారు.
జయలలిత డీహైడ్రేషన్, జ్వరంతో ఆసుపత్రిలో చేరారని, ఇన్ ఫెక్షన్ కారణంగా ఆమెను వెంటనే క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలించి అంతర్జాతీయ స్థాయి వైద్యం ప్రారంభించామని అప్పట్లో అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసిందని దీపా గుర్తు చేశారు..

కొన్ని రోజుల తరువాత అమ్మ ఆరోగ్యం కుదటపడుతున్నదని, టీవీ చూస్తున్నారని, ఆమె ఎప్పుడు కోరితే అప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు. అయితే సోమవారం ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన నివేదిక మరో విధంగా ఉందని దీపా అంటున్నారు.
సెప్టెంబర్ 22వ తేదిన జయలలిత శ్వాసకోస ఇబ్బందితో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారని ఎయిమ్స్ వైద్యులు నివేదిక ఇచ్చారని. అప్పట్లో ఈ విషయం ఎందుకు గోప్యంగా దాచిపెట్లారని దీపా జయకుమార్ ప్రశ్నించారు. మా అత్త జయలలిత మృతిపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయని, సీబీఐతో దర్మాప్తు చేయించాలని దీపా డిమాండ్ చేశారు.
జయలలితకు అపోలో ఆసుపత్రి అప్పట్లో ఇచ్చిన చికిత్స వివరాలు, ఇప్పుడు ఎయిమ్స్ వైద్యలు ఇచ్చిన నివేదికకు పొంతనలేదని దీపా వాదిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన జయలలిత చికిత్స వివరాలపై పన్నీర్ సెల్వం వర్గం సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications