ఈ జీవితం తమిళ ప్రజలకే, జయ పుట్టిన రోజే పార్టీ కార్యాచరణ: దీప
తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్. తానే అమ్మకు అసలైన వారసురాలినని దీప స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని ఆమె చెప్పారు.
జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24 నుంచి పార్టీ కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎంజీఆర్, జయలలిత అడుగుజాడల్లో తాను ముందుకు నడుస్తానని చెప్పారు. మెజార్టీ అమ్మ అభిమానులు తన వెంటే ఉన్నారని దీపా తెలిపారు.
అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తమిళ ప్రజల సేవకే తన జీవితం అంకితమని తెలిపారు. అన్నాడీఎంకే కార్యకర్తలంతా తనతోనే ఉన్నారని ఆమె ఉన్నారని చెప్పారు. అన్నాడీఎంకేలో చాలా మంది తన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.
జయలలిత మృతిపై తనకెలాంటి అనుమానాలు లేవని.. తన సోదరుడు దీపక్ ఆమెతో పాటు ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపారు. కాగా, దీపా జయకుమార్ వెంట భారీగా ప్రజలు, కార్యకర్తలు రావడం గమనార్హం. ఆమె కూడా మాటలు, వేషాధారణలో జయలలితను అనుసరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.