నిర్భయ తీర్పుపై షిండే, తండ్రి: కోర్టులో బోరుమన్న దోషి
న్యూఢిల్లీ: 'నిర్భయ' కేసు తీర్పు పైన హోంమంత్రి సుశీల్ కుమార్ స్పందించారు. శుక్రవారం దోషులకు ఢిల్లీ సాకేత్ కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. ఈ తీర్పు విద్రోహులకు చండశాసనమన్నారు. అత్యంత క్రూరులకు ఇలాంటి తీర్పు అనివార్యమని చెప్పారు. ఈ తీర్పు క్రూర నేరస్తులకు ఓ హెచ్చరిక అన్నారు.
అత్యంత అరుదైన కేసుల్లో ఉరి శిక్ష తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇక నుంచి ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అత్యాచార కేసులు హోంశాఖ వద్ద పెండింగులో లేవన్నారు. సత్వర పరిష్కారానికే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఈ తీర్పు ద్వారా నిర్భయ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు.
ఆత్మ శాంతిస్తుంది: నిర్భయ తండ్రి
ఈ తీర్పుతో తన కూతురు ఆత్మ శాంతిస్తుందని నిర్భయ తండ్రి అన్నారు. తొమ్మిది నెలల తర్వాత తాను ప్రశాంతంగా నిద్రపోతానన్నారు. దోషులకు మరణ శిక్ష హర్షణీయమన్నారు. సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాక్షసంగా ప్రవర్తించినందుకే: న్యాయమూర్తి
నిర్భయ కేసులో ఉరి శిక్ష విధించడానికి గల కారణాలను న్యాయమూర్తి చెప్పారు. నిర్భయ పట్ల వారు రాక్షసంగా ప్రవర్తించినందునే మరణ శిక్ష విధించినట్లు తెలిపారు. ఇది ఒక అరుదైన కేసు అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
కోర్టు హాలులో బోరుమన్న ఓ దోషి
నిర్భయ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ సాకేత్ కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సమయంలో దోషుల్లో ఒకడైన వినయ్ కోర్టు హాలులోనే బోరుమన్నాడు. తీర్పు అనంతరం దోషుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఇది రాజకీయ ప్రభావితమైన తీర్పు అన్నారు. తాము ఈ తీర్పు పైన పైకోర్టులో అప్పీల్ చేసుకుంటామన్నారు. నిర్భయ అత్యాచారం అనంతరం జరిగిన రేప్ల పైన ఎందుకు ఇంత ఆసక్తి లేదని ప్రశ్నించారు. ఈ తీర్పు తర్వాత రెండు నెలల్లోపు అత్యాచార ఘటనలు జరగకుంటే తాము అప్పీల్కు కూడా వెళ్లమన్నారు.