ఇంటికే మద్యం: కేజ్రీవాల్ సర్కారు సంచలన నిర్ణయం, యాప్స్ ద్వారా బుకింగ్స్
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా ఢిల్లీ కరోనా కేసులు భారీగా తగ్గుతుండటంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మందుబాబులకు ఓ తీపి కబురును అందించింది. మద్యం డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని హోండెలివరీకి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఆన్లైన్ పోర్టళ్లు, మొబైల్ యాప్ల ద్వారా బుకింగ్స్ తీసుకుని నేరుగా ఇంటికే మద్యాన్ని చేరవేసేందుకు మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ చట్టంలో సవరణలు కూడా చేసింది.
మద్యం దుకాణాల వద్ద భారీగా జనాలు చేరితే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత నెలరోజులుగా కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేస్తున్న ఢిల్లీ సర్కారు.. జూన్ 1 నుంచి పలు సడలింపులను కల్పించింది.
కాగా, ఢిల్లీలో మద్యం హోండెలివరీకి ముందు నుంచే అనుమతి ఉండటం గమనార్హం. అయితే, అది ఈమెయిల్ ేలదా ఫ్యాక్స్ ద్వారా బుక్ చేసుకుంటే మాత్రమే డెలివరీ చేస్తారు. తాజాగా, యాప్లు, ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా కూడా బుకింగ్ స్వీకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, ఢిల్లీలో ఉన్న అన్ని మద్యం దుకాణాలకు హోండెలివరీ అనుమతి ఇవ్వలేదు.
కేవలం ఎల్-14 లైసెన్స్లు ఉన్నవారికి మాత్రమే హోండెలివరీ చేయడానికి అనుమతించింది ప్రభుత్వం. కాగా, గత కొద్ది రోజులుగా డిల్లీలో 1000 లోపే కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్లోనూ మద్యం హోండెలివరీకి ప్రభుత్వాలు అనుమతివ్వడం గమనార్హం.